భారత్ మెరుపు దాడితో పాకిస్థాన్ వెన్ను లో వణుకు పుట్టేటట్లు చేసింది. చేసేదేమి లేక పాకిస్థాన్ ప్రేక్షకపాత్ర వహించింది. ఈ నేపథ్యంలో పాక్ నేషనల్ అసెంబ్లీలో అక్కడి ప్రతిపక్షాలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. షేమ్.. షేమ్.. ఇమ్రాన్ ఖాన్ అని నినాదాలు చేశాయి. సమాచారం మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడుల నేపథ్యంలో పాక్ పార్లమెంటులో రచ్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పనితీరును ఎగతాళి చేశాయి.
అధికారిక పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ మంత్రులు భారత్ చేపట్టిన దాడుల గురించి ప్రస్తావిస్తుండగా ప్రతిపక్ష పార్టీలు 'ఇమ్రాన్ ఖాన్ షేమ్ షేమ్' అని ఎద్దేవా చేశాయి. దీంతో పార్లమెంట్లో ఇరు పార్టీల నేతల మధ్య వాదనలు జరిగాయి. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఖావాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. అఖిల పక్షాన్ని పిలవాలని ప్రభుత్వానికి సూచించాడు. మన దేశం, మన దేశ సార్వభౌమత్వం, మన సమగ్రతకు ప్రమాదం ఉందని హెచ్చరించాడు. మనం సైన్యం అండగా ఉండాల్సిన సమయమని చెప్పాడు.
మరోవైపు, భారత్ దాడి గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. సరైన సమయం చూసుకుని బదులిస్తామని చెప్పారు. పాకిస్తాన్ త్వరలో తీసుకోబోయే అన్ని చర్యలకు సైన్యం, దేశ ప్రజలు సంసిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ ఖాన్ సూచించినట్లుగా ఎన్ఎస్సీ తెలిపింది. భారత్ కాల్పుల ఉల్లంఘన విషయాన్ని ఐక్య రాజ్య సమితిలో లేవనెత్తాలని కూడా పాకిస్తాన్ నిర్ణయించింది.