ఎన్నికల ముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్ 2.0 బీజేపీ సర్కార్ కు బాగా కలిసి వస్తుందని చెప్పాలి. పాకిస్థాన్ మీద తిరిగి దాడి చేయడంతో భారత్ లో అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయి. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఎదుర్కొనడానికి సిద్ధమవుతున్న తరుణంలో పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడి, దేశంలో పొలిటికల్ ఈక్వేషన్స్ని మార్చేసింది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్పై భారత్ చేసిన రెండో సర్జికల్ స్ట్రైక్తో ఆ ఈక్వేషన్ మోడీ సర్కార్కి మరింత అనుకూలంగా మారింది.
ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సోషల్ మీడియా వేదికగా బీజేపీ సానుభూతి పరులు.. నరేంద్ర మోడీనే, మిరాజ్ యుద్ధ విమానంలో పాకిస్తాన్ వెళ్ళి దాడులు చేసి వచ్చినట్లుగా ఫొటోలు తయారు చేసి వాటిని ట్రెండింగ్లోకి తీసుకొచ్చేస్తుండడం గమనార్హం. ఎన్నికల వేళ చకచకా మారిపోతున్న రాజకీయ పరిణామాలతో ఈక్వేషన్స్ అనూహ్యంగా 'టర్న్' తీసుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ ఇమేజ్ ఎవరూ ఊహించని స్థాయికి పెరిగిందన్నది నిర్వివాదాంశం.
సర్జికల్ స్ట్రైక్స్ పూర్తయ్యాక, ఈ రోజే నరేంద్ర మోడీ ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు, 'దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.. దేశం సేఫ్ హ్యాండ్స్లో వుంది..' అంటూ తన గురించిన భజన చేసుకోవడానికీ ఏమాత్రం మొహమాట పడలేదు. మరోపక్క, నరేంద్ర మోడీ ఏపీ టూర్ ఖరారయ్యింది. విశాఖలో నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ఆ బహిరంగ సభ వేదికగా నరేంద్ర మోడీ చేసే ప్రసంగం, ఆంధ్రప్రదేశ్తోపాటు జాతీయ రాజకీయాలపై అనూహ్యమైన ప్రభావం చూపబోతోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.