రాజకీయానికి ఉన్న మహత్యమే వేరు. అధికారం ముందు బంధుత్వాలు కూడా బలాదూర్ అవుతాయి. ఇందుకు మరో ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతున్న మరో నియోజకవర్గం ప్రత్తిపాడు.
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు ఆ తర్వాత టీడీపీకి వెళ్లారు. ఇప్పుడు ఆయనకు ఆయన సొంత మనవడే పోటీ అవుతున్నాడు. ఆయన మనుమడు డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజా కొంత కాలంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తనదైన శైలిలో ప్రజల్లో దూసుకుపోతున్నాడు.
రాజా వైపు టీడీపీ మొగ్గు చూపుతుందా...సుబ్బారావుకు టికెట్ ఇస్తుందా అన్నది ఇంట్రస్టింగ్ గా ఉంది. వీరిరువురూ టికెట్ కోసం చంద్రబాబును కలిశారు. ఆయన ఇద్దరిలో ఎవరికీ హామీ ఇవ్వకుండా మీరే తేల్చుకోండి అంటూ చెప్పి పంపినట్టు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో అర్థం కాని పరిస్థితి.
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు.. ఇక్కడ వీరిద్దరికీ కాకుండా వేరే నాయకులకు టికెట్ ఇచ్చే అంశం కూడా లేకపోలేదు. మనవడు కాస్త పట్టువిడుపుగా ఉన్నా.. తాత సుబ్బారావు మాత్రం తానే పోటీచేస్తానని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పినా వినేపరిస్థితి కనిపించడం లేదు.