భారత్కు చెందిన పైలట్ అభినందన్ను తాము కస్టడీలోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్కు చిక్కిన అభినందన్కు కొంత మంది సైనికులు అతి దారుణంగా హింసిస్తూ..కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని కంటికి తీవ్ర గాయం అయినట్లు..చెతులు వెనక్కి విరిచి కట్టి మాట్లాడించడం సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. దాంతో భారత పౌరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాజాగా మిగ్-21లో వెళ్లి పాక్కు చిక్కిన అభినందన్కు ఏమీ కాకూడదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఆకాంక్షించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అతని కుటుంబ సభ్యులు కాస్త ధైర్యంగా ఉండాలన్నారు.
ఇక జెనీవా కన్వెన్షన్స్లోని ఆర్టికల్ 3 ప్రకారం ఖైదీలను అన్ని దేశాలు మానవతా దృక్పథంతో చూడాలి. ఐఏఎఫ్ పైలట్ అభినందన్ విషయంలో పాకిస్థాన్ ఇలాగే వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న అభినందన్ కి ఎలాంటి హానీ తలపెట్టకుండా చూసుకోవడం పాకిస్థాన్ బాధ్యత అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. కాగా, బుధవారం ఉదయం భారత్ వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానం కూలిపోయింది. ఆ విమానం పైలట్ జాడ కనిపించకుండా పోవడం, ఆ తర్వాత కొద్ది సేపటికే పాకిస్థాన్ ఆ పైలట్ ని తమబలగాలు అదుపులోకి తీసుకున్నాయని ప్రకటించడం కలకలం సృష్టించింది.
బుధవారం ఉదయం తీవ్రవాద శిబిరాలపై సైనికేతర భారత్ చర్యలు తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం భారత మిలటరీని లక్ష్యంగా చేసుకుంది. భారత వైమానిక దళాలు పాక్ను సమర్థంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్కి చెందిన ఎఫ్16 విమానాన్ని కూల్చివేశాయి. ఈ క్రమంలో ఐఏఎఫ్కి చెందిన ఓ మిగ్21 విమానం కూలిపోయింది. ఇదే సమయంలో మిగ్21ని నడుపుతున్న పైలట్ కనిపించకుండా పోయాడని వార్తలు వచ్చాయి.. అయితే ఆ పైలెట్ ని పాకిస్థాన్ కస్టడీలో తీసుకున్నామని ప్రకటించడం జరిగింది.