ఎన్నికలకు ముందు కేంద్ర
ప్రభుత్వం ప్రకటించిన విశాఖపట్నం రైల్వేజోన్ సక్సెస్ క్రెడిట్ కోసం రాజకీయపార్టీలు
పాకులాట మొదలుపెట్టాయి. ఎన్నికలు ముందుకొస్తున్నాయి కదా ? రాబోయే ఎన్నికల్లో ఓట్ల
కోసం క్రెడిట్ గోల మొదలైంది. తమ వల్లే విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ వచ్చిందంటే
కాదు తమ వల్లే అంటూ ప్రతీ పార్టీ ఓన్ చేసుకోవటం మొదలైంది.
నిజానికి ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చే ఉద్దేశ్యం నరేంద్రమోడికి ఎంతమాత్రం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగున్నరేళ్ళపాటు రైల్వేజోన్ అంశంపై మాటా పలుకు లేకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసిందంటేనే ఓట్ల రాజకీయమని అర్ధమైపోతోంది. రేపటి ఎన్నికల్లో బిజెపి ఒక్క అసెంబ్లీలో కానీ ఎంపి సీటు కానీ గెలిచే సీన్ లేదు. వారం క్రితం ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర బిజెపి నేతలు అదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పారు.
ప్రత్యేకహోదా కానీ రైల్వేజోన్ కానీ ఇవ్వక పోవటం వల్ల జనాల్లో బిజెపిపై ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉన్నది వివరించారు. హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండానే రేపటి ఎన్నికల్లో ఓట్ల కోసం వెళితే జనాలు కొట్టేట్లున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకనే నరేంద్రమోడి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే హడావుడిగా ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటన చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అయినా మొత్తానికి రైల్వేజోన్ అయితే ప్రకటించింది కదా అదే చాలు.
ఇక ఎప్పుడైతే రైల్వేజోన్ ను కేంద్రం ప్రకటించిందో వెంటనే సక్సెస్ కోసం పాకులాట మొదలైంది. తమ పోరాటాల వల్ల కేంద్రం దిగొచ్చిందంటే కాదు తమ పోరాటాల వల్లే రైల్వేజోన్ ప్రకటించిందని చెప్పుకుంటున్నాయి. నిజానికి హోదా అయినా రైల్వేజోన్ అంశమైనా సజీవంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డే కారణం.
నాలుగేళ్ళపాటు ఎన్డీఏతో అంటకాగినంత కాలం ఈ డిమాండ్లేవీ చంద్రబాబునాయుడుకు పట్టలేదు. ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి వచ్చేశారో అప్పటి నుండే డ్రామాలు మొదలుపెట్టారు. ఇక మిగిలిన పార్టీల విషయం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అంశాలపై పోరాటాలు చేసిందెవరు ? డ్రామాలాడిందెవరో జనాలకు తెలీకుండానే ఉంటుందా ?