బెజవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ టికెట్పై గెలి చిన జలీల్ ఖాన్.. తర్వాత జరిగిన సమీకరణల్లో చంద్రబాబుకు జై కొట్టారు. ప్రస్తుతం ఏపీ వక్ఫ్ బోర్డుకు చైర్మన్గా ఆయన సేవలు అందిస్తున్నారు. పార్టీ తరఫున ఈ పదవి ఉన్నందున, మరోపక్క తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో జలీల్ ఖాన్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఏడాది కిందటే ప్రకటించారు. ఈ క్రమంలోనే అమెరికాలో స్థిరపడిన ఆయన కుమార్తె ఖతూన్ను విజయవాడకు రప్పించారు. తన టికెట్ను ఖతూన్కు ఇచ్చేలా చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారు. ఆర్తికంగా బాగుండడం, గెలిపించుకునే సత్తా ఉండడంతో చంద్రబాబు ఖతూన్కు టికెట్ను తొలి జాబితాలోనే కన్ఫర్మ్ చేశారు.
ఇంత వరకు అంతా నల్లేరుపై బండి నడకే అన్నట్టు సాగినా.. ఇప్పుడు తీరా టికెట్ కన్ఫర్మ్ అయి, పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించాక.. అసలు సిసలు సమస్య వచ్చి పడింది. గతంలో విజయవాడ మేయర్గా చేసిన ఇదే సామాజిక వర్గానికి చెందిన మల్లికాబేగం రంగంలోకి దిగారు. ఖతూన్పై కత్తికట్టారు. గతంలో తాను కాంగ్రెస్ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు జలీల్ ఖాన్ చేసిన మంత్రాంగం, వేసిన అడ్డుపుల్లలను ఇప్పుడు ఖతూన్పైనా ప్రయోగించారు. గతంలో బేగం రంగంలోకి దిగినప్పుడు జలీల్ పనిగట్టుకుని(అంటే.. ఈ సీటును అప్పట్లో జలీల్ ఆశించారు. అయితే, రాష్ట్ర పీసీసీ జలీల్ను పక్కన పెట్టి బేగంకు కేటాయించింది.) ఆమెపై ఫత్వా జారీ చేయించారు.
దీంతో పోటీ నుంచి తప్పుకోకపోయినా.. ముస్లిం సంప్రదాయం ప్రకారం మల్లికా బేగం బురఖా ధరించి ఎన్నికల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెకు ఓటింగ్ శాతం భారీగా తగ్గిపోయి.. చివరకు ఓడిపోయారు. ఈ పరిణామాన్ని మనసులో పెట్టుకున్న బేగం ఇప్పుడు అదే ఫత్వాను జారీ చేయించారు. దీనికి గాను బేగం గడిచిన నాలుగు రోజులుగా తీవ్ర ఆందోళనకు దిగారు.
ఫత్వా జారీ చేసే వరకు అన్నం, నీరు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ముస్లిం పెద్దలు ఇప్పుడు ఖతూన్పై ఫత్వా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి దిగితే ఖచ్చితంగా ఖతూన్ బురఖా ధరించే రంగంలోకి దిగాలి. ఈ పరిణామంతో పశ్చిమ టీడీపీలో తీవ్ర అలజడి రేగింది. మరోపక్క, జలీల్ ఖాన్ కుమార్తె అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత నాగుల్ మీరా కూడా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.