జగన్మోహన్ రెడ్డికి దగ్గర
బంధువైన మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా
పోటీ చేయబోతున్నారా ? జిల్లాలోని పార్టీ వర్గాలు చెప్పేదాన్ని బట్టి అలాగే
అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా పోటీ చేయటానికి వైవి అన్నీ
విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే, టికెట్ సాధ్యం కాదని వైసిపి అధ్యక్షుడు జగన్
వైవితో తేల్చి చెప్పేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ తో మొదలైన విభేదాల కారణంగానే వైవి కానీ ఆయన కుటుంబసభ్యులు కానీ జగన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎక్కడా కనబడలేదు. టిడిపి ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎంపిగా పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దాన్ని వైవి అడ్డుకుంటున్నారట. మాగుంటను హేళన చేస్తు వైవి ఈమధ్యే బహిరంగ వ్యాఖ్యలు చేయటం కూడా జగన్ ను ఆగ్రహం తెప్పించాయని సమాచారం. దాంతోనే టికెట్ ఇవ్వటం కుదరదని వైవికి ఖరాఖండిగా చెప్పేశారట.
టికెట్ విషయంలో స్పష్టత రాగానే వైవి చురుగ్గా పావులు కదుతుపుతున్నారు. వైసిపి టికెట్ కోసమే చివరి నిముషం వరకూ ప్రయత్నించాలని ఏ కారణం వల్లనైనా దక్కకపోతే తప్పని పరిస్దితుల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే విషయాన్ని వైవి ఆలోచిస్తున్నారట. జిల్లాలోని తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తప్పకపోతే ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలి కానీ టిడిపిలోకి మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదని వైవి మద్దతుదారులతో అన్నట్లు సమాచారం.
ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వైవికి గెలిచే సత్తా ఉందా ? అన్నదే సందేహం. నిజానికి వైవికంటూ సొంతంగా వర్గం, బలం లేదు. ఉన్నదల్లా వైసిపి బలమే. ఎంపిగా ఉన్న కాలంలో కూడా పార్టీ ఇమేజికన్నా సొంత ఇమేజి కోసమే వైవి పాకులాడారని, పార్టీ బలోపేతానికన్నా బలహీన పరచటానికే ఎక్కువ సమయం కేటాయించారనే ఆరోపణలున్నాయి వైవిపై. సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో వ్యక్తిగత వైరం వల్లే పార్టీని గబ్బుపట్టించేశారనే ఆరోపణలున్నాయి.
అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ ఏర్పాటుకు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు, సాగు, తాగు నీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు వైవి గట్టిగా కృషి చేశారని కూడా చెబుతుంటారు. చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకు కేంద్రపథకం ద్వారా కోట్లాది రూపాయల నిధులు తెప్పించారని కూడా అంటున్నారు. ఫ్లోరైడ్ రహిత మంచినీటి సరఫరా కోసం కూడా వైవి కృషి చేశారని మద్దతుదారులంటున్నారు. ఏదేమైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలుపు అంత ఈజీ మాత్రం కాదు. మరి జనాలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.