పుల్వామా దాడి తర్వాత భారత్ -పాక్ మద్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు నువ్వా నేనా అన్న చందంగా బార్డర్ లో బుల్లెట్ల వర్షం కురిపించుకుంటున్నారు. నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూర్చొని మాట్లాడుకుందామని..ఉగ్రవాద అంతం అందరూ కోరకుంటున్నారని..పుల్వామ దాడి విషయంలో తాము కూడా బాధపడుతున్నామని..అందుకోసం అన్ని విషయాల్లో విచారణకు సిద్దమని అన్నారు. కానీ తెల్ల వారుజామున కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఇదిలా ఉంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ను పాకిస్థాన్ అదుపులో ఉంచుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పైలట్ అభినందన్ ను పాక్ ఆర్మీ ఇబ్బందులకు గురి చేస్తోందని... జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని భారత రక్షణ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో సమావేశం ఏర్పాటు చేసి పాక్ ని ఓంటరి చేసే ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా తిరిగిరానున్నాడు. పాకిస్థాన్ కస్టడీ నుంచి అతడు క్షేమంగా భారత్కు చేరుకోనున్నాడు. తాజాగా మేం పట్టుకున్న భారత పైలట్ అభినందన్ను రేపు విడుదల చేస్తాం అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
జెనీవా ఒప్పందంలో భాగంగా అతడిని భారత్కు అప్పగించేందుకు పాకిస్థాన్ రెడీ అయింది. వింగ్ కమాండ్ అభినందన్ వర్థమాన్ను భారత్కు తిరిగి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్థాన్ పార్లమెంట్ ఉభయ సభల్లో దీనిపై అధికారిక ప్రకటన చేశారు.
భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉద్రక్తతలను తగ్గించుకునే క్రమంలో భారత్ ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నిన్న తాను యత్నించానని చెప్పారు. తాము ఏ విషయంలోనూ భయపడటం లేదని..కేవలం శాంతి భద్రతలను ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.