ఇరవై రోజుల తేడాలో ప్రధాని మోడీ మరో మారు ఏపీ టూర్ వేశారు. మొదట రాజధాని గుంటూరులో గర్జించిన మోడీ ఇపుడు ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖలో విజ్రుంభించనున్నారు. మోడీ గుంటూర్ టూర్ కి విశాఖ ట్రిప్ కి చాలా తేడా ఉంది. ఈ మధ్యలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఎదురులేని వీరుడిగా :
మొదటగా చెప్పుకుంటే దాయాది పాక్ పీచమణిచిన వీరుడిగా మోడీ విశాఖ వస్తున్నారు. దశాబ్దాలుగా తలవంచని పాక్ ని దారికి తెచ్చిన ఘనతను సొంతం చేసుకుని మరీ వైజాగ్ వస్తున్నారు. చుక్క రక్తం బొట్టు చిందకుండా దాయాదికి దిమ్మ దిరిగే దెబ్బ కొట్టిన ధీరుడుగా మోడీ విశాఖలో అడుగుపెడుతున్నారు. సహజంగా ఈ పరిణామం మోడీ ఇమేజ్ ని బాగా పెంచేసింది. దాంతో ఆయనకు ఇదివరకులా నిరసలన కంటే పాజిటివ్ గా స్పందించే విశాఖ జనమే ఈసారి ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
కల తీరిన వేళ :
ఇక మరో వైపు మోడీ విశాఖ రైల్వే జోన్ ఇచ్చేశారు. ఇది దశాబ్దాల నాటి కల. దీన్ని సాకారం చేసిన మోడీకి ఇపుడు విశాఖలో జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంది. తన కీలకమైన ఎన్నికల హామీని అలా నెరవేర్చుకున్న మోడీ పట్ల విశాఖ పూర్తి సానుకూలతను చూపే వీలుంది ఇక మోడీ ప్రసంగాన్ని వినడానికి కూడా జనం ఎదురుచూస్తున్నారు. మోడీ అంటేనే మాటల ప్రవాహం. ఆయన ఏం చెబుతారన్న ఉత్కంఠ వైజాగ్ వాసుల్లో బాగా ఉంది.
ఏం చెబుతారో :
రైల్వే జోన్ ఇచ్చిన మోడీ మరెన్ని వరాలు ఇస్తారో అన్న ఆశలు కూడా విశాఖ సభపైన అందరికీ ఉన్నాయి. మోడీ ఈసారి భిన్నమైన తీరులో ప్రసంగం చేస్తారని అంటున్నారు. ఇక ఏపీకి చేయాలసిన పనులను కూడా ఆయన చెబుతారని అంటున్నారు. ఇదే వూపులో ప్రత్యేక హోదా పైన కూడా ఓ మాట అనే అవకాశం కూడా ఉండొచ్చని కమలనాధుల ఆశ. ఇక మోడీ ఈసారి కూడా ఏపీ సీఎం చంద్రబాబుని వదిలిపెట్టకపోవచ్చునని అంటున్నారు.
క్లీన్ బౌల్డేనా :
బాబుని తన పదునైన విమర్శలతో చెడుగుడు ఆడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కేంద్రంలోని విపక్ష కూటమిని తూర్పారా పడతారని అనుకుంటున్నారు. ఓ విధంగా మోడీ సమరోత్సాహంతో ఉన్నారు. ఆయన ప్రసంగాంలో అన్నీ మెరుపులే ఉంటాయని, ఆయన వేసే షాట్స్ కి విపక్షన్ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని కమలనాధులు పూర్తి ధీమాతో ఉన్నారు. మరి ఈ రోజు సాయంత్రం మోడీ మీటింగుకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అది ఎలా ఎలా సాగుతుందో చూడాల్సిందే.