కేటీఆర్ కొడుకు హిమాన్ష్ .. అప్పుడే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. 8 వ తరగతి చదువుతున్న హిమాన్ష్.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇంతకూ ఈ పతకం ఎందుకు ఇచ్చారంటారా.. పర్యావరణ పరిరక్షణ అనే అంశంలో దాదాపు 30 వేల కిలోల పునరుత్పాదక వ్యర్థాలను సేకరించినందుకు వచ్చింది.
హిమాన్ష్ రావు ప్రస్తుతం ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నిర్వహించిన పర్యావరణ విభాగం పోటీల్లో పాల్గొన్నాడు. అత్యధిక మొత్తంలో పునరుత్పాదక వ్యర్థాలను సేకరించి గోల్డ్ మెడల్ సంపాదించాడు.
హిమాన్షు తన ఇల్లు, పాఠశాల, ఇరుగు పొరుగు వారి నుంచి ఈ వ్యర్థాలు సేకరించాడు. పాత వార్తా పత్రికలు, రాత పుస్తకాలు వంటి పునరుత్పాదక సామగ్రిని సేకరించాడు. హిమాన్ష్ చదువుతున్న పాఠశాల కూడా జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. రజత ట్రోఫీని అందుకుంది.
తెలంగాణ ఉద్యమ నిర్మాత కేసీఆర్ కు కేటీఆర్ ప్లస్ పాయింట్ అని విశ్లేషకులు చెబుతారు. ఉద్యమ సమయంలో విదేశాల నుంచి వచ్చినా.. తక్కువ కాలంలోనే కేటీఆర్ రాజకీయాల్లో ఒదిగిపోయారు. ఇప్పుడు ఏకంగా కార్యనిర్వాహక అధ్యక్షుడైపోయారు. మరి హిమాన్ష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడేమో..