కారణాలు స్పష్టంగా తెలీదు
కానీ మంగళగిరి వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు
సమాచారం. కొద్ది రోజులుగా పార్టీ అధిష్ఠానంతో ఆళ్ళ టచ్ లో లేరట. దాంతో ఆళ్ళకి
ఏమైందో తెలీకుండా పార్టీ నేతలు, మద్దతుదారులు టెన్షన్ పెరిగిపోతోంది. రాబోయే
ఎన్నికల్లో ఆళ్ళ పోటీ చేసే విషయమై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో
నియోజకవర్గం మొత్తం మీద వైసిపి శ్రేణుల్లో గందరగోళం మొదలైంది.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి అయ్యే వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని తాను పోటీ చేయలేనని ఆళ్ళే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో చెప్పినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే జగన్ కూడా ఆళ్ళకు ప్రత్యామ్నాయాలను చూస్తున్నట్లు సమాచారం. అసలు ఆళ్ళనే ప్రత్యామ్నాయాలను చూడమని చెప్పిన జగన్ ఎంఎల్ఏ సూచించిన ఆశావహులను కాదని తానే సొంతంగా చూసుకుంటున్నారన్నది ఓ ప్రచారం.
అదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో చేయించినట్లుగానే మంగళగిరిలో కూడా జగన్ సర్వేలు చేయించారట. అందులో ఆళ్ళ గెలవరని ఫీడ్ బ్యాక్ వచ్చిందని మరో ప్రచారం జరుగుతోంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఆళ్ళకు ప్రత్యామ్నాయంగా మరో గట్టి అభ్యర్ధి ఉడుతా శ్రీనును పోటీకి దింపుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. జరుగుతున్న ప్రచారాన్ని పక్కనపెడితే ఆర్దికంగా ఆళ్ళ కంఫర్టబుల్ గా లేరన్నది వాస్తవం. అయితే అదే సమయంలో నియోజకవర్గంలో ఆళ్ళ బాగా పాతుకుపోయారన్నదీ నిజమే.
రాబోయే ఎన్నికల్లో ఆళ్ళను ఓడగొట్టేందుకు చంద్రబాబునాయుడు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, చంద్రబాబు కంట్లో ఆళ్ళ నలుసుగా తయారయ్యారు. అనేక సదావర్తి భూముల లాంటి అనేక అంశాలపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆళ్ళ కోర్టుల్లో కేసులు వేసి ముప్పు తిప్పలు పెడుతున్నారు.
రాజధాని రైతుల తరపున కూడా ఆళ్ళ ఇటు క్షేత్రస్ధాయిలోనే కాకుండా అటు కోర్టుల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి ఆళ్ళ గెలుపుపై ఎవరికీ అనుమానలు లేవు. ఈ నేపధ్యంలోనే ఆళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో చంద్రబాబు మీడియా ఓవర్ యాక్షన్ చేస్తోందని వైసిపి నేతలు మండిపడుతున్నారు. మరి నిజమేమిటో ఆళ్ళే చెప్పాలి.