మంచు మోహన్ బాబు.. సినీ నటుడిగా, విద్యాసంస్థల అధినేతగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. విలక్షణ నటుడిగా పేరొందిన మోహన్ బాబు అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మోహన్ బాబు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడ్తారనే పేరు తెచ్చుకున్నారు. ఇక రాజకీయాల్లో మాత్రం మోహన్ బాబు స్టాండ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. తాజాగా ఆయన చంద్రబాబును టార్గెట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
నాలుగేళ్లుగా ఫీజ్ రీఎంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మోహన్ బాబు విమర్శించారు. దీనిపై చంద్రబాబుకు లేఖ రాసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆందోళన చేయక తప్పదని హెచ్చరించారు. అంతటితో ఆగని మోహన్ బాబు, చంద్రబాబు రాజకీయాలపైన కూడా మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి అలవికాని హామీలిచ్చి ఓట్లేయించుకున్నారని, ఇప్పుడు వాటిని అమలు చేయట్లేదని విమర్శించారు. దీంతో మోహన్ బాబు రాజకీయ ఉద్దేశంతోనే ఈ విమర్శలు చేస్తున్నారని అర్థమైంది. అంతేకాక ఫీజ్ రీఎంబర్స్ మెంట్ రాని కాలేజీలు రాష్ట్రంలో చాలా ఉండగా మోహన్ బాబు ఈ సమయంలో ఒక్కడే మీడియా ముందుకు రావడం ఆశ్చర్యం కలిగించింది.
రాజకీయాల్లో మోహన్ బాబు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదనే పేరుంది. ఇటు చంద్రబాబు తనకు సన్నిహితుడని, పార్టీలో కలిసి పని చేశామని చెప్పుకుంటారు. అన్న ఎన్టీఆర్ హయాం నుంచి తనకు, చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉందంటారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును కుటుంబసమేతంగా వెళ్లి కలుస్తుంటారు. మోహన్ బాబు పిల్లలు కూడా వెళ్లి సెల్ఫీలు దిగుతుంటారు. అటు వై.ఎస్. ఫ్యామిలీతో కూడా మోహన్ బాబు ఫ్యామిలీకి చుట్టరికం ఉంది. జగన్ పెదనాన్న కుమార్తెను మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు పెళ్లి చేసుకున్నాడు. దీంతో వాళ్ల మధ్య బంధం ఏర్పడింది. దీంతో సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు దగ్గరకు వెళ్లినట్లే జగన్ దగ్గరకు కూడా వెళ్తుంటుంది మోహన్ బాబు ఫ్యామిలీ.
ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ జగన్ కు మేలే చేసేందుకేననేది పొలిటికల్ ఎనలిస్టుల టాక్. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మోహన్ బాబు ఇలాంటి కామెంట్స్ చేయడం సహజమేననేది వారు చెప్పే మాట. తన ఉనికి చాటుకోవడానికి ఆయన ఇలాంటి ఎత్తుగడలు వేస్తారనే టాక్ కూడా ఉంది. మరి చూద్దాం.. మోహన్ బాబు ఏ గోడ దూకుతాడో..!!?