ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన గుంటూరు పశ్చిమ సీనియర్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీకి రేపో మాపో ఆయన రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయించి.. ఇప్పుడు దానికి కూడా టికెట్ ఇచ్చేందుకు పార్టీ వెనకాముందు ఆడుతుండటంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అసంతృప్తితో ఉన్న విషయాన్ని తమకు అవకాశంగా మల్చుకునేందుకు వైసీపీ కాచుకుని మరీ కూర్చుంది. ఇప్పటికే ఆయనతో వైసీపీ అగ్రనాయకత్వం చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మోదుగుల కొనసాగుతూ వస్తున్నారు. గుంటూరు పశ్చిమ స్థానం అభ్యర్థి ఎంపికలో తన పేరు లేకపోవడంపై ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం.
గతంలో ఇదే విషయమై చంద్రబాబును కలసిన మోదుగులకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో నాటి నుంచే వైసీపీలోని ఓ వర్గం నేతలతో ఆయన టచ్లోకి వెళ్లారట. అయితే ఆ విషయం తెలిసినా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఇక పార్టీలో ఉండటం తనకు ఏమాత్రం గౌరవం కాదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలో సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేసిన తనను అవమానిస్తున్నారని ఆయన ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి.. ఆలపాటి రాజా, తాడికొండ.. తెనాలి శ్రవణ్కుమార్కు కేటాయించినట్టు సమాచారం.
కాగా, గుంటూరు పశ్చిమ స్థానానికి కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన్ కృష్ణ, చందు సాంబశివరావు, గుంటూరు తూర్పు స్థానానికి మద్దాలి గిరి.. ముస్లిం వర్గానికి చెందిన ఇంకో ముఖ్యనేత పేరు పరిశీలనలో ఉండటం గమనార్హం. పార్టీకి ఎంతో సేవ చేసిన తనను కాదని వేరొకరికి సీటు కేటాయించడంపై మోదుగుల కలత చెందారు. రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మోదుగుల విషయంలోనూ అదే వైఖరిని అవలంభిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నా నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయించాలని జగన్ యోచిస్తున్నారట. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారైనట్లేనని తెలుస్తోంది. అదే జరిగితే నిన్నా మొన్నటి వరకు కలసి పనిచేసిన మోదుగుల వేణుగోపాల్రెడ్డితో ఆయన పోరుకు సై అనాల్సి ఉంటుంది.