తెలుగు రాష్ట్రాల మధ్య పెను సంచలనాలకు కారణమైన ‘ఐటీ గ్రిడ్’ సంస్థ డైరెక్టర్ అశోక్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన కోసం రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు. తమ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులైన భాస్కర్, ఫణి, చంద్రశేఖర్ విక్రమ్లు కన్పించడం లేదని ఐటీ గ్రిడ్ కంపెనీకి యాజమాని ఆశోక్ ఆదివారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నలుగురు కంపెనీ ఉద్యోగులను విడిచిపెట్టినట్లు తెలంగాణ పోలీసులు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘ఐటీ గ్రిడ్’ సంస్థ డైరెక్టర్ అశోక్ ప్రశ్నించడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కావలి, బెంగళూరులో గాలింపును ముమ్మరం చేశారు. ఓట్ల గల్లంతు కేసులో తెలుగు రాష్ట్రాల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. ‘ఐటీ గ్రిడ్’ సంస్థ డైరెక్టర్ అశోక్ అదుపులోకి వస్తే కానీ అసలు విషయాలు పూర్తిగా వెల్లడి కావని పోలీసులు అంటున్నారు.