ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్..! ఈ రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించాయనే ఆరోపణలపై ఈ రెండు సంస్థలపైన ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఏపీ డేటా తస్కరించాయంటూ హైదరాబాద్ లో కేసులు నమోదవడంతో ఇది వివాదానికి కారణమైంది. అయితే అసలు ఈ రెండు సంస్థలు ఏం చేస్తాయి? వీటిపై వివాదాలకు కారణమేంటి..?
బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇది విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ఐటీ సంస్థ. అయితే దీని ప్రధాన వ్యవహారాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానివే.! ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు పథకాలకు సాఫ్ట్ వేర్ సేవలను బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ అందిస్తోంది. రైతు సాధికార సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, నీటి పారుదల శాఖ... లాంటి ప్రభుత్వ విభాగాలకు అధికారిక సేవలందిస్తోంది బ్లూఫ్రాగ్ సంస్థ. విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ దగ్గర ఆయా పథకాల లబ్దిదారుల వివరాలు నమోదై ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఆ సంస్థే వెబ్ సైట్స్, నిర్వహణ వ్యవహారాలను చూస్తోంది.
ఇక ఐటీ గ్రిడ్స్ అనేది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సాఫ్ట్ వేర్ సంస్థ. దీని సీఈవో అశోక్..! ఈ సంస్థ ఏపీ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్స్, యాప్స్ వ్యవహారాలన్నీ చూస్తోంది. ఆ పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమం జరిగినా దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందిస్తోంది. అయితే ఇటీవల పార్టీ కోసం విస్తృత స్థాయిలో సేవా మిత్ర అనే యాప్ ను రూపొందించింది. ఇందులో పార్టీ అధినేత నుంచి బూత్ లెవల్ కార్యకర్తల వరకూ సమాచారాన్ని పొందు పరిచారు. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని బూత్ లెవల్ కార్యకర్తలు పైవారికి అందించేలా దీన్ని రూపొందించారు. బూత్ లెవల్ లో పరిస్థితి ఏంటి.. ఎవరు ఎటు వైపు ఉన్నారు.. లాంటి సమాచారాన్ని ఇందులో పేర్కొనవచ్చు.
అయితే... తెలుగుదేశం పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్ కోసం బ్లూ ఫ్రాగ్ సంస్థ తన దగ్గరున్న ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని అందించిందనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ లబ్దిదారులను ఈ యాప్ కు అనుసంధానించి వారి వ్యక్తిగత సమాచారాన్ని రాబడుతున్నారని, ఇది డేటా చౌర్యం చేయడమేనని వైసీపీ ఫిర్యాదు చేసింది. కోట్లాదిమంది వ్యక్తిగత సమాచారాన్ని పార్టీకోసం వినియోగించడం చట్టరీత్యా నేరమని కంప్లెయింట్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే తెలంగాణ, ఏపీ మధ్య మరోసారి వివాదానికి ఆజ్యం పోస్తోంది.