ప్రతి వారికి వ్యక్తిగత జీవితం ఉంటుంది.  అందుకే రాజ్యాంగం కూడా వ్యక్తిగత స్వేచ్చను హక్కుగా ప్రసాదించింది. చెప్పాలనుకున్నవి కొన్ని ఉంటే ఎవరికీ చెప్పకూడనివి ఎన్నో ఉంటాయి. అలాంటి రహస్యాలను సేకరించి వేరే వాళ్ళకు అప్పగించడం మహాపరాధం. ఇది ఎవరు చేసినా కూడా రాజ ద్రోహమే. 


ఏపీలో డేటా ఫైట్ :


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. ఇక్కడ గెలుపు ప్రధానమైపోయింది. ఎలాగైనా గెలిస్తేనే నిలిచేది అని అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ భావిస్తున్నాయి. పాత తప్పులు చేయకుండా వైసీపీ జాగ్రత్త పడుతూంటే తమకున్న  వ్యూహాలతోనే ముందుకు పోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ మధ్యలో వచ్చిందే డేటా చోరీ కేసు. దీని మీద లోకేశ్వర రెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో డొంకంతా కదులుతోంది. విషయానికి వస్తే  ఏపీ సర్కార్ వద్ద ఉండాల్సిన సమాచారం ఓ ప్రైవేట్ సంస్థ వద్ద ఉండడం దారుణాతి దారుణం. దీని మీద ఎవరెన్ని చెబుతున్నా ఇది ఏపీ ప్రజల గుట్టుని రట్టు చేయడమేనని నిపుణులు సైతం అంటున్నారు.


ఓట్లకోసమేనా :


వచ్చే ఎన్నికల్లో ఓట్ల పంట పండిచుకోవాలన్న తాపత్రయం ఇందులో ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత రెండు నెలలుగా చూస్తే ఓట్ల తొలగింపు జరుగుతోందంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది. అయితే అది అధికార టీడీపీ కార్యకర్తలు సర్వేల పేరిట చేయిస్తున్నారని ఫిర్యాదు  చేసింది కూడా. ఇదిలా ఉండగానే తమ వద్దకు ఒక్కసారిగా ఏడున్నర లక్షల వరకూ ఫారమ్  7 పరిట దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం తాజాగా  ప్రకటించింది. నిజానికి ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడాన్ని ఈసీ కూడా ఆశ్ఛర్యంగా  చూస్తోంది. ఈ రెండింటికీ లింక్ ఇపుడు దొరికిందా అన్న కోణంలో నుంచే డేటా చోరీ కేసు ని తెలంగాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రాజద్రోహమే :


ప్రభుత్వాన్ని నమ్మి పౌరులు తమ వివరాలు ఇస్తారు. కొన్ని వివరాలు ఇంట్లో వారికి కూడా చెప్పరు. అలాంటిది ఆ వివరాలు ఓ ప్రైవేట్ సంస్థ చేతిలోకి వచ్చాయంటే నిజంగా షాకింగ్ న్యూసే మరి. ఐటి  గ్రిడ్ సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ నెల్లూరు జిల్లా వాసి. ఆయన టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వచ్చాయి. అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. మరి వీటిని అన్నింటినీ మధింపు చేసుకుంటే రాజకీయ ప్రయోజనం కోసం డేటా చోరీ అయిందా అన్న సందేహాలు వస్తున్నాయి. అదే జరిగితే రాజ ద్రోహమే అవుతుంది. పాలకులను నమ్మి ప్రజలు ప్రజా సాధికారిక సర్వే పేరిట మూడేళ్ళ క్రితం తమ మొత్తం గుట్టు చెప్పారు. ఇపుడు అవన్ని ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్తే ఇంక భద్రత ఏముంటుందన్న డౌట్లు కూడా వస్తున్నాయి.


ఎదురుదాడితో :


ఇక దీని మీద అధికార టీడీపీ వాదన పూర్తిగా ఎదురుదాడితో ఉండడం  విశేషం. ఇరవ‌య్యేళ్ళుగా ఇలా డేటా ఉంచుకున్నామని టీడీపీ పెద్దలు చెబుతూఒంటే  ఆశ్ఛర్యంగా ఉంది. ఎందుకు డేటా ఉంచుకోవాలన్నదే ఇక్కడ ప్రశ్న. పార్టీ వారు అయినంత మాత్రమా వారి వ్యక్తిగత డేటా తీసుకోవడమూ తప్పే అన్న విషయాన్ని టీడీపీ పెద్దలు మరచిపోతున్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు చూస్తే  ఎవరి వ్యక్తిగత వివరాలు ఒక్క ప్రభుత్వం వద్ద తప్ప మరెవరి వద్దా కూడా  ఉండరాదని క్లారిటీగా పేర్కోంది. మరి అలాంటి వివరాలు పార్టీ నాయకుల వద్ద ఉన్నా కూడా  అవి ప్రైవేట్ వే అవుతాయి. 


అది పూర్తిగా రాజ్యాంగం ప్రకారం తప్పే అవుతుంది. లబ్దిదారుల డేటా ఉండాల్సింది ప్రభుత్వ అధికారుల వద్ద అంతే తప్ప పార్టీ నాయకుల వద్ద కాదు. అలా డేటా బయట  ఉందంటే దానికి బాధ్యత అధికారులది కూడా అవుతుంది.  లేటెస్ట్ డేటా ఫైట్ మొత్తం మీద చూసుకుంటే విస్తుబోయే నిజాలే ఇపుడు వస్తున్నాయి. పాలకులు తామే కంచె దాటించి గుట్టు రట్టు చేయాలనుకుంటే అంతకు మించిన ప్రమాదం వేరోటి ఉండదని మేధావులు అంటున్నారు.  ఐదు కోట్ల మంది ఆంధ్రుల వ్యక్తిగత, కుటుంబ, ఆర్ధిక, సామాజిక సమాచారం దొంగతనానికి బాధ్యులు ఎవరు అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. ఇప్పటికైనా ఈ డేటాను చోరీ చేసిన వారెవరో పూర్తి దర్యాప్తు  చేయించాలి. అసలు దోషులెవరో తెలియాలని అంతా కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: