రెండు రోజులుగా తెలుగు
రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ డాకవరపు అశోక్ ఎక్కడున్నట్లు
? ఇపుడిదే ప్రశ్న పలువురిని వేధిస్తోంది.
అశోక్ కోసం తెలంగాణా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు. విజయవాడ,
బెంగుళూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే,
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అశోక్ ను అధికారపార్టీ ముఖ్య నేతలే జాగ్రత్తగా
దాచిపెట్టారట. దాంతో పోలీసులు ఎంత గాలించినా పెద్దగా ఉపయోగం ఉండదనే వాదనకు బలం
పెరుగుతోంది.
గతంలో ఓటుకునోటు కేసు బయట పడినపుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అప్పటి టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు కాబట్టి సరిపోయింది. తర్వాత అదే కేసులో పాత్ర ఉన్న మరో ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య వెంటనే మాయమైపోయారు. ఎప్పుడైతే రేవంత్ అరెస్టయ్యారో వెంటనే సండ్ర ఆచూకీ దొరకలేదు. అప్పట్లో సండ్ర కోసం పోలీసులు ఎంతగా గాలించినా ఉపయోగం లేకపోయింది. దాదాపు 15 రోజులపాటు సండ్ర అడ్రస్ ఎవరికీ దొరకలేదు.
అప్పట్లో 15 రోజులు సండ్ర ఎక్కడికి వెళ్ళిపోయారు ? ఎక్కడికంటే ఎక్కడికీ వెళ్ళలేదు. ఏపిలోని అధికార పార్టీ ముఖ్యనేతల నీడలోనే హాయిగా కాలం గడిపేశారు. ఏపిలో ముఖ్యనేతలే సండ్రను సేఫ్ ప్లేస్ లో దాచటంతో తెలంగాణా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. 15 రోజుల్లో సండ్రకు అవసరమైన లీగల్ ఫీడ్ బ్యాక్ ఇప్పించిన తర్వాత తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయేట్లు చేశారు.
ఇప్పుడు కూడా అశోక్ సేఫ్ ప్లేస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అశోక్ ది నెల్లూరు జిల్లానట. అందులోను టిడిపి ఎంఎల్సీ బీద రవిచంద్రయాదవ్ కు దగ్గర బంధువంటున్నారు. కాబట్టి వారి సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంటారనే ప్రచారం ఊపందుకుంటోంది. రెండు రోజులుగా చంద్రబాబు డిజిపి, అడ్వకేట్ జనరల్ తో వరుసగా జరుపుతున్న భేటీలు కూడా ఆ ప్రచారినికి మద్దతుగా ఉంది.
నిజానికి టిడిపికి మాత్రమే ఐటి గ్రిడ్ కంపెనీ సేవలందిస్తుంటే చంద్రబాబు, లోకేష్ అంతలా ఉలిక్కిపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ చంద్రబాబు చెప్పిందే నిజమైతే టిడిపి కార్యకర్తలు, నేతల వివరాలు మాత్రమే కాకుండా మొత్తం 3.5 కోట్లమంది జనాల వివరాలు ఎందుకు ఉన్నట్లు ? ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా తెలంగాణా పోలీసులు ఏపి ప్రజల మీదే దాడి చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. చూద్దాం చంద్రబాబు, చినబాబుల బండారం ఈసారైనా బయటపడుతుందేమో ?