ఈ మద్య కొంత మంది మృగాళ్ల దాష్టికాలు పెచ్చుమీరుతున్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలతో మహిళలు పగటి పూట కూడా స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపించిన ఆడవారిపై లైంగిక వేధింపులు..దొంగతనాలు ఇలా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకప్పుడు మహాత్మాగాంధీ ఓ మహిళ అర్థరాత్రి ఒంటరిగా స్వేచ్చగా తిరిగినపుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు..కానీ ఇప్పుడు ఓ ఇంటరి మహిళ మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా తిరగాలంటేనే గుండెల్లో వణుకు పుడుతుంది.
ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై చివరకు వృద్దులు, చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. వారం రోజుల క్రితం వరంగల్లో రవళి అనే యువతిపై అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రవళి అనే యువతి దారుణంగా కాలిపోయింది..వారం రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందింది. గతంలో తను ప్రేమించి ఇప్పుడు దూరంగా ఉంటుందని పగ పెంచుకొని అన్వేష్ అనే యువకుడు కాలేజీ నుంచి స్నేహితురాలి హాస్టల్కి వెళుతుండగా నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఘటన జరిగిన వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. తొలుత ఆమెకు వరంగల్లో చికిత్స అందించిన వైద్యులు.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. వారం రోజులుగా రవళి హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం అప్పగిస్తామని అధికారులు చెప్పినట్లు రవళి బంధువులు తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం రవళి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం వరంగల్ అర్బన్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురం తీసుకొచ్చి, అంత్యక్రియలు నిర్వహిస్తారని హన్మకొండ సీఐ సంపత్రావు తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తె మరణవార్త తెలిసి రవళి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్వేష్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.