రాజకీయాల్లో వ్యూహాలు కీలకంగా పని చేస్తాయి. ప్రత్యర్థి వ్యూహాలకే చెక్ పెడితే ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడదే జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో. ఓవైపు డేటా చోరీ కేసులో తెలంగాణ సైబరాబాద్ పోలీసులు హైకోర్టు ఆదేశంతో దర్యాప్తు సాగిస్తుండగా, ఇదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని ఫోకస్ చేస్తూ, దానికి మద్దతుగా నిలిచిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ (IPAC) సంస్థపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఐప్యాక్ నిర్వహించే సోషల్ మీడియా అకౌంట్స్పై ఆంక్షలు విధించారు. వాటిపై కూడా కొన్ని కేసులు నమోదు చేశారు.
ఏపీ పోలీసుల కేసులను బట్టీ చూస్తే... వీలైనంతవరకూ వైసీపీ నుంచి ప్రశాంత్ కిషోర్ ను దూరం చేయడమేనని తెలుస్తోంది. అసలు హైదరాబాద్లో డేటా చోరీ కేసుకీ, ఏపీలో ప్రశాంత్ కిషోర్ సంస్థపై కేసులకూ సంబంధం ఏమిటన్న అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే టీడీపీ వ్యూహం మరోలా ఉంది.
నిజానికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త. గతంలో మోడీతో సహా చాలా రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నారు. ప్రశాంత్ కిషోర్ నడుపుతున్న ఐప్యాక్ సంస్థ సర్వేలు చేస్తూ, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పరిస్థితి ఎలా ఉందో అంచనాలతో రిపోర్టులు ఇస్తుంటుంది. ప్రస్తుతం ఐప్యాక్... వైసీపీకి రాజకీయ అంశాల్లో సహాయం చేస్తోంది. రెండేళ్లుగా ఆ పార్టీకి సలహాలు, సూచనలూ ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. కొన్ని నెలల క్రితం బీహార్ రాజకీయాల్లోకి వెళ్లిన ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ తగ్గించారు.
ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రశాంత్ కిషోర్ పేరు మళ్లీ వినిపిస్తోంది. తాజాగా డేటా చోరీ కేసులో టీడీపీ కుట్ర పన్ని, ఓటర్ల జాబితా నుంచీ వైసీపీ మద్దతుదారుల పేర్లను తొలగిస్తోందన్న ప్రచారం చేయించడం వెనక ప్రశాంత్ కిషోరే ఉన్నట్లు టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంత ప్రయత్నిస్తున్నా ఈ కేసు నుంచీ తప్పించుకోవడం టీడీపీకి సవాలేనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తుండటంతో ఎదురుదాడి చేస్తూ.. తాము ఏ తప్పూ చేయలేదనీ, అంతా ప్రశాంత్ కిషోర్ చేస్తున్న అసత్య ప్రచారమేనని ప్రజలు భావించేలా చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు టాక్. అందులో భాగంగానే ఐప్యాక్పై కేసులు పెట్టి ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యూహానికి ప్రశాంత్ కిషోర్ ఎదురు వ్యూహం ఎలా ఉందనుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.