వారసులను రాజకీయ అరంగేట్రం చేయించాలన్న తెలుగుతమ్ముళ్ల కల ఈసారికి నెరవేరేలా కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నేతలకే పెద్ద పీట వేస్తూ తనయులకు వచ్చే సారి అవకాశం కల్పిస్తామంటూ చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు నచ్చజెబుతున్నారట. వాస్తానికి టీడీపీలో అనేక మంది నేతలు ఈ సారి తమ వారసులను ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించారట. తమతో పాటు తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కొంతమంది అంటే..నాకు టికెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదు..నా వారసుడికి టికెట్ ఇవ్వండంటూ ప్రతిపాదించిన వారున్నారు. చంద్రబాబు మొదట ఈ అంశంపై మొదట సానుకూలంగా ఉన్నా మిగతా నేతల్లో అనేక మంది నుంచి ఇలాంటి ప్రతిపాదనే రావడం.. ఆశావహుల సంఖ్య పెరుగుతుండటం అసమ్మతులకు దారితీస్తుందనే ఉద్దేశంతోనే వారసులకు టికెట్లు అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
తమ వారసులను రంగంలోకి దింపాలని ఆశపడిన వారిలో సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. టికెట్లు ఆశించిన వారిలో ముఖ్యంగా పరిటాల తనయుడు శ్రీరాం, జేసీ దివాకర్ రెడ్డి కొడుకు, చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్, మంత్రి గంటా తనయులు.. ఇలా చాలామందే ఉన్నారు. ఓ దశలో మంత్రి నారాయణ కూడా తన కుమార్తెను నెల్లూరు నుంచి పోటీ చేయించాలని చూశారు.ఇక తన కొడుకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ వస్తున్న మంత్రి సోమిరెడ్డికి కూడా నిరాశే మిగిలింది. కొడుకు రాజగోపాల్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా ఉన్నా ఆయన బదులు తిరిగి తండ్రి పోమిరెడ్డికే చంద్రబాబు టికెట్ ఇవ్వడం గమనార్హం.
గత మూడు.. నాలుగు సంవత్సరాలుగా కుమారులను రాజకీయాల్లో తిప్పుతూ..వారి చేత రాజకీయ ఓనమాలు దిద్దిస్తూ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించి విజయాన్ని కట్టబెడితే ఇక నిశ్చితంగా ఉండవచ్చని...అంతా మైండ్లో సెట్ చేసుకుని ఉన్న నేతలకు చంద్రబాబు చర్య కొద్దిగా బాధ కలిగిస్తున్నా... పార్టీ అధిష్ఠానం చెబుతున్న కారణాలతో కన్విన్స్ కాక తప్పని పరిస్థితి. దీనికి తోడు కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పిల్లల పెత్తనమే ఎక్కువగా ఉందన్న ఫిర్యాదులు వచ్చాయట. అలాంటి నేతలకు టికెట్లు ఇస్తే గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆలోచన కూడా చంద్రబాబును సీనియర్లకే పెద్దపీట వేసేలా చేశాయనే వాదన ఉంది.