ఏపీ డేటా లీకేజ్ వ్యవహారం ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ వ్యవహారం బయటపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి తీవ్ర తలనొప్పులు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ప్రజల కు సంబందించిన సమాచారం బయటకు ఎలా వెళ్లిందన్నదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు సమాదానం చెప్పడం లేదని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రశ్నించారు.ఆ డేటా చంద్రబాబుకు చెందిన ఐటి కంపెనీకి ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు.
ఎంతో సున్నితమైన సమాచారాన్ని తన బినామీ కంపెనీలకు పంపించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అని ఆయన ప్రశ్నించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి పేరు ఓటర్ల జాబితాలో లేకుండాపోయిందంటే పరిస్థితి ఏ విదంగా అర్దం చేసుకోవచ్చని ఆయన అన్నారు.అదే సమయంలో మంత్రి లోకేష్ పేరు ఎందుకు ఓటర్ల జాబితాలో లేకుండా పోలేదని ఆయన అన్నారు.
టిడిపి సేవా మిత్ర యాప్ ద్వారా కీలకమైన సమాచారం తీసుకుని, దానిని టిడిపి నేతలకు పంపించారని, పూర్తిగా చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారని జగన్ ద్వజమెత్తారు.డేటా దొంగతనం చేస్తూ పట్టుబడి కనీసం క్షమాపణ చెప్పకపోగా, ఎదురు దొంగా, దొంగా అని అరుస్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు.ఈ డేటాను దగ్గర పెట్టుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు.