‘మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిందట’ ఎవరో యువతి - సామెతలాగా తప్పు చేసిన తెలుగుదేశం పార్టీ - తెలుగుదేశం పార్టీ నాయకత్వం 'ఓటుకు నోటు' మాదిరే "ట్వీట్ కు నోటు" కుంభకోణానికి శ్రీకారం చుట్టి నేఱానికి పాల్పడిందని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కలవకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు కొందరికి డబ్బులు చెల్లించి దొంగ ఖాతాలు సృష్టించి, ట్విటర్ లో అసత్య ప్రచారం చేయిస్తోందని పేర్కొన్నారు.
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం దానిని ప్రైవేటు కంపెనీ ఐటీ గ్రిడ్స్కు చేరవేయడం తద్వారా ప్రైవసీ చట్టానికి తూట్లు పొడిచిందని, "ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే" అన్నట్లు దీనిపై దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. ఇదంతా చూస్తుంటే నేఱం చేసిన వాళ్ళే దొంగా! దొంగా! అంటూ పోలీస్ వెంట పరుగెత్తినట్లుందని అభిప్రాయం వెలిబుచ్చారు.
నిన్న మంగళవారం ట్విటర్ లో కేటీఆర్ ఈ వాఖ్యలు చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీ ప్రజల సమాచారం ప్రైవేటు సంస్థకు అప్పగించడం, ప్రభుత్వం పాత్రను ప్రత్యేకించి అధినేతలు చంద్రబాబు పాత్రను పరోక్షంగా నిర్ధారిస్తోందని, ఈ అంశంలో ఏపీ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగ ట్వీట్లు ఎన్నికల్లో పనిచేయవని, నిజమైన ఓటర్లు మాత్రమే ఓటు వేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మరిచిపోరాదని కేటీఆర్ తెలిపారు.
"చంద్రబాబూ! ఈ వ్యవహారంలో మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే కదా మీ భయం?" అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీలోని 3.5కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత గోప్యతకు సంభంధించిన సమాచారం వారికి తెలియకుండా ప్రైవేటుసంస్థకు చేరినట్లు స్పష్టమైన, పుష్కలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను ఆశించిచేసిన అత్యంత ప్రమాదకరమైన నేఱమని చెప్పవచ్చు.