ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధి ఎయిడ్స్ ..ఈ వ్యాధి సోకిన వారు ఖచ్చితంగా ఎక్కవ కాలం బ్రతకరు. పెద్ద ,పెద్ద శాస్త్రవేత్తలు దీనికి మందు కనిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు..కానీ ఫలితం మాత్రం శూన్యం. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ ఎయిడ్స్లాంటి ప్రాణాంతక వ్యాధిని మనిషి ఇంకా జయించలేదు. ఎయిడ్స్కు విరుగుడు కనిపెట్టడానికి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.ఎయిడ్స్ సోకిన వాళ్ళంతా ఎవరికీ చెప్పుకోలేక చికిత్స లేక నరకం అనుభవిస్తున్నారు. ఎయిడ్స్ కి మందు లేదు..నివారణ ఒక్కటే మార్గం అంటూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్తో బాధపడుతున్న3.7 కోట్ల మంది.
తాజాగా ఎయిడ్స్ వ్యాధి భారిన పడ్డవారు మానసిక వత్తిడికి గురికావాల్సిన అసరం లేదని మందులు పదే పదే వాడాల్సిన అవసరం లేదని..భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర గుప్తా నిరూపించారు. 1980ల్లో గుర్తించిన ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనిషి బయటపడటం ఇది రెండోసారి మాత్రమే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించిన తర్వాతే శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పగలమని ఆయన అంటున్నారు. కాగా, అమెరికాకు చెందిన తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి 12 ఏళ్ల కింద ఎయిడ్స్ను జయించి రికార్డు సృష్టించగా.. లండన్లో హెచ్ఐవీ వైరస్ సోకిన ఓ వ్యక్తికి మూలకణ మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్) ద్వారా ఈ వైరస్ నుంచి ఉపశమనం కలిగినట్లు డాక్టర్లు వెల్లడించారు. అదే పేషెంట్కు క్యాన్సర్ చికిత్స కూడా అందిస్తున్నారు.
18 నెలలుగా అతడు ఎలాంటి హెచ్ఐవీ డ్రగ్స్ తీసుకోవడం లేదని, ఆ వైరస్ నుంచి చాలా వరకు ఉపశమనం లభించిందని డాక్టర్లు చెప్పారు. అయితే హెచ్ఐవీ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్లే అని చెప్పడం కూడా సరి కాదని వాళ్లు స్పష్టం చేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, కేమ్బ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల పరిశోధకులు ఈ కేసును అధ్యయనం చేశారు. మూలకణాల ద్వారా హెచ్ఐవీకి చికిత్స కల్పించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు.
ఉత్తర యూరప్ ప్రాంతంలో అతికొద్ది మందిలో మాత్రమే సీసీఆర్ 5 జన్యుమార్పు ఉండటం దీనికి కారణం.రోగి, దాతల మూలకణాలు కచ్చితంగా సరిపోయినప్పుడే చికిత్స చేయగలరు. రోగి, దాత మూలకణాల పోటీ కాస్తా వైరస్ తొలగిపోయేందుకు కారణమవుతుందని రవీంద్ర అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా హెచ్ఐవీకి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు.
ఇలాంటి విధానం ద్వారానే ఇప్పుడు మరో పేషెంట్ కూడా హెచ్ఐవీ వైరస్ నుంచి ఉపశమనం పొందడంతో పరిశోధకుల్లో విశ్వాసం రెండింతలైనట్లు ఇందులో పాలుపంచుకున్న ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా అన్నారు. హెచ్ఐవీ వైరస్పై జరుగుతున్న పరిశోధనల్లో ఈ మూలకణ మార్పిడి చికిత్స అన్నది చాలా పెద్ద ఘనతే అని మరో ప్రొఫెసర్ ఎడుర్డో ఒలవరియా చెప్పారు.