డేటా దొంగతనంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ కోసం వాడుకుంటున్న చంద్రబాబుపైన, పార్టీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ ముఖ్యమంత్రి చేయకూడని తప్పు చేశారని జగన్ ఆరోపించారు. తెలంగాణలో నమోదైన కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి సైబర్ నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. డేటా స్కామ్ పై లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై జరిగిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని జగన్ తెలిపారు. టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ లో ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు ఎలా ఉంటాయని జగన్ ప్రశ్నించారు. ఇది సైబర్ క్రైమ్ కాదా అని నిలదీశారు.
సేమా మిత్ర యాప్ లోకి ఓటర్ల కలర్ ఫోటోలు ఎలా వచ్చాయని జగన్ నిలదీశారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే కలర్ ఫోటోలతో కూడిన ఓటరు జాబితాలు ఉంటాయని, బయటకు ఇచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ పోటోలు మాత్రమే విడుదల చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ యాప్ లో కలర్ ఫోటోలు ఎలా వచ్చాయని జగన్ నిలదీశారు. ఈ అంశంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తామని చెప్పారు.
యాప్ ద్వారా వ్యక్తులకు ఫోన్లు చేసి వారు ఏ పార్టీకి ఓటేస్తారో తెలుసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. అలా సర్వేలో తెలుసుకున్న సమాచారం ఆధారంగా ప్రతిపక్షాల కార్యకర్తలు, ఓటర్లను తొలగిస్తున్నారని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం రెండేళ్లుగా చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. గతంలో 56 లక్షల ఓట్లను తొలగిస్తే కోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అక్కడి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. డేటా స్కామ్ పై సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ విచారణ జరగకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.