నెల్లూరు జిల్లా కొవూరులో టీడీపీకి ఎదురుదెబ్బ తగలనుంది. కొవూరులో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై గెలిచిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికే టీడీపీ అధిష్ఠానం టికెట్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆయన ఇప్పటికే తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రెండురోజుల్లో ఆయన వైసీపీ కండువా కప్పడం ఖాయమనే అభిప్రాయం ఇటు టీడీపీ అటు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కొద్దిరోజుల క్రితం కొవూరు టికెట్ ఇవ్వాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం పెళ్లకూరు శ్రీనివాస్రెడ్డి అనుచరులతో కలసి అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబును కలశారట. అయితే చంద్రబాబు అప్పుడు సానుకూలంగా స్పందించడంతో టికెట్ వస్తుందని అనుచరుల వద్ద చెప్పుకుంటూ తదనుగుణంగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపడటంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం. పార్టీ మారి తన ఓటు బ్యాంకు ఎంత ఉందో చంద్రబాబుకు చూపాలని నిర్ణయానికి వచ్చినట్లు, ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి మొదట్నుంచి ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కుటుంబానికి మంచి రాజకీయ ట్రాక్ రికార్డ్ ఉంది. వ్యక్తిగతంగా ఇక్కడ ప్రసన్నకుమార్రెడ్డి కుటుంబసభ్యులకు సొంతంగా ఓటు బ్యాంకు ఉంది. ఇలాంటి పరిస్థితిలో టీడీపీలో చీలిక వస్తే ఇబ్బందులు తప్పవనే టెన్షన్ క్యాడర్లో నెలకొని ఉంది. అధినేతే స్వయంగా రంగంలోకి దిగి శ్రీనివాస్రెడ్డిని బుజ్జగిస్తే తప్ప పరిస్థితిలో మార్పు కనిపించేలా లేదని టీడీపీ శ్రేణుల నుంచి తెలుస్తోంది. కొవూరులో పాగా వేసిన టీడీపీ మళ్లీ గెలవాలంటే అన్నివర్గాలను కలుపుకుపోతోనే వైసీపీని ఇక్కడ ఎదుర్కొవడం సాధ్యమవుతుందనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి అధినేత ఏం చేస్తాడో..