ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ కోసం పోటీలు పెరిగాయి. నాయకులు ఎక్కడికక్కడ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒక విధమైన ప్రత్యేక వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ నాకంటే నాకేనని నాయకులు పోటీ పడుతు న్నారు. వాస్తవానికి ఇది మామూలే. అయితే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాత్రం గడిచిన ఏడాదిగా ఉన్న వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు గత ఏడాది హఠాత్తుగా మృతి చెందారు. అప్పటికే ఆయన సేవలు మెచ్చుకున్న చంద్రబాబు.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఉండగానే ముద్దు మృతి చెందారు. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు విషయంలో నూ గాలి కుటుంబం వివాదాలకు దిగింది.
మాకంటే మాకేనని గాలి చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు భాను ప్రకాశ్లు పోరాడుకున్నారు. దీంతో వివాదం అమరావతికి చేరడంతో చంద్రబాబు మధ్యే మార్గంగా ఎమ్మెల్సీ అవకాశాన్ని గాలి సతీమణి సరస్వతమ్మకు అప్పగించారు. దీంతో ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వివాదం తెరమీదికి వచ్చింది. గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమ ఇక్కడ వైసీపీ నాయకురాలు నటి రోజాపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఇక్కడ నుంచి గాలి ఫ్యామిలీ నుంచి సరైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా గాలి సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గాలి ఫ్యామిలీని మరోసారి సంప్రదించి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో తేల్చుకోవాలని చెప్పారు. అయితే, ఇక్కడ మరోసారి ఈ కుటుంబం వివాదానికి తెరదీసింది.
ఇద్దరు కుమారులు కూడా టికెట్ నాకంటే నాకని వివాదానికి దిగారు. వాస్తవానికి గాలి ముద్దుకృష్ణమ జీవించి ఉన్న సమయంలోనే తన రాజకీయ వారసుడిగా భాను ప్రకాష్ను నియోజకవర్గానికి పరిచయం చేశారు. అందరూ కూడా భానును తమ సొంత సోదరుడిగా భావించడం మొదలు పెట్టారు. కానీ, ఇప్పుడు భానుకు టికెట్ ఇస్తమంటే చిన్న కుమారుడు, తల్లి సరస్వతమ్మ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ వివాదం మరోసారి పీటముడి పడేలా ఉంది. నిజానికి రెండు పదవులు వచ్చినపప్పుడు అంటే ఒకటి ఎమ్మెల్సీ, మరొకటి ఎమ్మెల్యే పదవులు వచ్చినప్పుడు వాటిని గాలి కుమారులు ఇద్దరూ తీసుకుని సంయమనంతో వ్యవహరించి నగరిలో తండ్రి పేరు నిలబెట్టేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఆ దిశగా ఎప్పుడు అడుగులు పడతాయో చూడాలి.