టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోరు పెంచారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్, తనయుడు కేటీఆర్ ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి పార్టీలో తన తర్వాత కీలకమైన పాత్ర కేటీఆర్ దే, భవిష్యత్ కూడా అతడే అని చెప్పకనే చెబుతున్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కేటీఆర్ కీలక భూమిక పోషించిన నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనయుడిపై బరువైన బాధ్యతలు పెట్టారు కేసీఆర్.
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే కేటీఆర్ ప్రచారంలోకి దిగారు. కేసీఆర్ కు బాగా అచ్చొచ్చిన కరీంనగర్ నుంచి కేటీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒకప్పుడు టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు అంటే హరీష్ రావ్ అన్న పేరు ఠక్కున వినిపించేది. కానీ ఆ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఎవరు అంటే కేటీఆర్ అని పార్టీ నేతలందరూ చెబుతున్న పరిస్థితి. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న కేటీఆర్ సభలు హోరెత్తుతున్నాయి.
గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలవడం ద్వారా.. అవన్నీ కేటీఆర్ వల్లే వచ్చిందనే ఫీలింగ్ ప్రజల్లో కల్పించారు కేసీఆర్. ఆ తర్వాత మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఇది కూడా కేటీఆర్ క్రెడిట్లోకి వెళ్లిపోయింది. తెలంగాణలో ఇప్పటి వరకు కేసీఆర్.. కేటీఆర్కు అప్పగించిన బాధ్యతలలో రెండు కీలక ఎన్నికలు సక్సెస్ చేశారు. ఇక మిగిలి ఉంది లోక్ సభ ఎన్నికలు. ఇవి కూడా పూర్తైతే.. అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ కు విజయం సాధించి పెట్టిన లీడర్ అవుతాడు కేటీఆర్.
లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్ల టార్గెట్ తో బరిలోగి దిగుతుంది. ఈ 16 సీట్లు సాధిస్తే.. కేటీఆర్ ఆధిపత్యానికి అడ్డుచెప్పే గొంతు, నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో కనిపించడు. అందుకే కేటీఆర్ కూడా 2019 లోక్ సభ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వస్తోన్న ఎన్నికలు కావడంతో.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని అగ్రపథాన నిలబెట్టి తన తండ్రికి కానుకగా ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు కేటీఆర్.
ఈ నేపథ్యంలో కేటీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేర్చబోతున్నారు? 16 లోక్సభ స్థానాలు గెలిపిస్తారా? గెలిపించి ఆ క్రెడిట్ అందుకుని సీఎం పీఠంపై కూర్చుంటారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.