ఐటీ గ్రిడ్స్ కంపెనీ సమాచార చౌర్యం (డేటా చోరీ) కేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని పోలీస్ ఐజి మరియు ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్, స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే చాలా పురోగతి సాధించినట్లు తెలిపారు. డేటా చోరీ కేసుకు సంబంధించి ఆయన గురువారం (మార్చి 7) సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలంగాణ ప్రజల డేటాను కూడా తీసుకుందని మరో కొత్త విషయం తెలిపారు.
హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తు న్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఉన్న వేళ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కీలక వివరాలు తెలిపారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో టీడీపీ కీ-పర్సన్ అనే కోడ్ తో పిలిచే వారు కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. టీడీపీకి ఈ ‘కీ’ పర్సన్స్ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్ వ్యవహారంలో ఆన్లైన్లో జరిగే కీలక పరిణామాలను మ్యాప్ రూపంలో సీపీ వివరించారు.
ఏపీ ప్రజలకు చెందిన ఆధార్, ఓటర్ ఐడీ లాంటి సున్నితమైన సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. టీడీపీకి చెందిన ‘సేవా మిత్ర’ యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజల ఆధార్ నంబర్, సామాజిక వర్గం, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ పరిశీలిస్తోందని.. అనంతరం ఈ సమాచారాన్ని టీడీపీ బూత్ కన్వీనర్లకు చేరవేస్తున్నారని... వారు పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తులను గుర్తించి.. తమ ఓట్లను తొలగించాలంటూ ఆయా ఓటర్లే కోరుతున్నట్లుగా దరఖాస్తు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
- సేవామిత్ర యాప్ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ.. వివిధ మార్గాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటా సేకరించింది.
- దీని ఆధారంగా ఇక్కడి కాల్ సెంటర్లోని వాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తారు.
- వారు చెప్పే అంశాలను పొందుపరుస్తూ.. ఆ వివరాలను సేవామిత్ర సైట్కు అప్లోడ్ చేస్తారు.
- ఈ డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది.* దీన్ని నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి సేవామిత్ర కన్వీనర్లకు అనువుగా తయారు చేసి వారికి పంపిస్తుంది.
- క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ అందులోని ఓటర్ల వివరాలను సరిచూసే ఈ బూత్ స్థాయి కన్వీనర్లు వారి ఆధార్, మొబైల్ నంబర్లు, కులం, రాజకీయ ప్రాధాన్యం వివరాలు సేకరిస్తారు.
- ఇలా రూపొందించిన డేటాను మళ్లీ హైదరాబాద్లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు పంపిస్తారు.
- ఈ డేటాను మరికొన్ని కోణాల్లో విశ్లేషించే ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీ వ్యతిరేక ఓటర్లు, ఆయా ప్రాంతాల్లో లేని వారిని గుర్తిస్తుంది. ఇలా సమగ్ర విశ్లేషణతో తయారు చేసిన జాబితాలను టీడీపీ ‘కీ’ పర్సన్ కు పంపిస్తుంది.
- యాప్ లో వీరికి ‘టీడీపీ కీ-పర్సన్’ అనే కోడ్ వర్డ్ ఇచ్చారు.
- ఆ టీడీపీ కీ పర్సన్ తనకు అందిన ఫైనల్ జాబితాలోని ఓటర్లు టీడీపీకి చెందిన వారు కాదని నిర్ధారించుకుంటాడు.
- వారి పేరుతో తప్పుడు మార్గంలో ఫామ్-7 రూపొందించి ఓట్లు తొలగించేందుకు ఓటర్ ప్రమేయం లేకుండానే సంబంధిత అధికారికి పంపించేస్తారు.
- సేవా మిత్ర సర్వే లో వేరే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన వారు తమకు ఓటు వేయరనే ఉద్దేశంతో తొలగించేస్తున్నారు.
- సర్వే సమయంలో అందుబాటులో లేనివాళ్లు, పోలింగ్ సమయంలో వచ్చి వేరే పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో తీయించేస్తున్నారని పోలీసులుఅనుమానిస్తున్నారు.