జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తర్వలో సంచలనం సృష్టించాలని డిసైడయ్యారట. ఇప్పటివరకూ ఆ పార్టీ చాలా స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఆ పార్టీలో కదలిక లేదు. దీంతో పవన్ ఈ ఎన్నికలపై అంత సీరియస్ గా ఉన్నట్టు కనిపంచడం లేదని విశ్లేషణలు వస్తున్నాయి.
అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 14న రాజమండ్రిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని పవన్కల్యాణ్ నిర్ణయించారు. 2014లో ప్రారంభమైన జనసేన ఈ అయిదేళ్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసారి ఆవిర్భావ దినోత్సవ సభకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆ పార్టీ చెబుతోంది.
ఈ సభకు భారీగా జనసేకరణ చేసి సత్తా చాటాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. వామపక్ష పార్టీలతో తమ పొత్తు ఉంటుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ పోటీ అనేది క్లారిటీ ఇవ్వలేదు. రాజమండ్రి సభలో తేల్చాలని జనసేన భావిస్తోందట.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జనసేన సభ జరగనుంది. రాజమండ్రి సభ తర్వాత- విశాఖ, విజయవాడ తదితర నగరాలలో భారీ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బొమ్మదేవర శ్రీధర్ ఆధ్వర్యంలో 15మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాలని పవన్ ఆలోచిస్తున్నారట.