ఈమధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత జగన్ పైన విరుచుకుపడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కాబట్టి ఈ మాత్రం విమర్శలు సహజంగానే ఉంటాయి. అయితే ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ఆ విమర్శల తాకిడి మరింత ఎక్కువైంది. అయితే జగన్ అరాచకవాది అని, అతని ఆగడాలు సాగబోవని చంద్రబాబు హెచ్చరిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని, అధికారులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు.. ఇలాంటి ఆరోపణలు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నుంచి మరీ ఎక్కువయ్యాయి.
రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ అరాచకాలు ఎక్కువయ్యాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దొంగఓట్లను ఆ పార్టీనే జోడిస్తూ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ఇప్పుడు ఓ ఓట్లను తొలగించాలంటూ పాం-7లను ఆన్ లైన్ లో నింపి చేయరాని తప్పు చేసిందన్నారు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. అరాచకాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు సీఎంగా ఏం చేస్తున్నారు..? అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం మీ దగ్గర ఉండి కూడా కామ్ గా ఎందుకున్నారనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.!
ఈ ఒక్క అంశం మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారనేది మరొక అంశం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నేతలపై దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకునే అధికారం కూడా ఆ పార్టీకి ఉంటుంది. మరి ఎందుకు తీసుకోవట్లేదు? అంటే అలాంటివేవీ లేవనే కదా అర్థం..? తెలంగాణలో కూర్చుని కేసీఆర్ అండదండలతో జగన్ ఈ పనులు చేయిస్తున్నారనేది చంద్రబాబు చేస్తున్న మరొక ఆరోపణ. అసలు అలాంటి అవసరం జగన్ కు ఏముంది?
ఐటీ గ్రిడ్స్ ఉండేది హైదరాబాద్ లో.. ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి కేసు హైదరాబాద్ లో నమోదైంది. అక్కడే విచారణ జరుపుతున్నారు. దీనిపై రాద్ధాం చేయాల్సిన అవసరం ఏముందనేది వైసీపీ చేస్తున్న వాదన. ఐటీ గ్రిడ్స్ నుంచి సమాచారం సేకరించి వైసీపీకి ఇచ్చారని పోలీసులను తప్పుబడుతున్నారు. అలాంటి పనులు చేయాల్సిన అవసరం తెలంగాణ పోలీసులకు ఏముంటుంది? ఎలాగూ ఈ ఇష్యూపై ఏపీలో కేసు నమోదు చేశారు కదా.. అప్పుడైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
అధికారం చేతుల్లో ఉండి ఏదైనా తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఉండి కూడా ప్రతిపక్షంపై ఈ ఏడుపులేంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టుందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.