ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో ఫలితాలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలో కి చాలా మంది నేతలు ప్రముఖులు జాయిన్ అవడానికి క్యూ కడుతున్నారు.
ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు కూడా వైసీపీ పార్టీ లోకి వెళ్లడానికి ఇష్టపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు తల బాదుకుంటున్నారు. ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు.
ఆయన తన మద్దతుదారులతో కలిసి రాగా, పార్టీ అదినేత జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అవడం అవసరమని భావిస్తున్నామని అన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు చెప్పారు.
పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానం వైఎస్సార్తోనే మొదలైందని వెల్లడించారు. 2005లో యూనివర్సిటీ బోర్డ్ మెంబర్గా వైఎస్సార్ నియమించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఆరేళ్ల పాటు యూనివర్సిటీ బోర్డ్ మెంబర్గా పనిచేశానని తెలిపారు. తాజాగా ఈయన వైసిపి పార్టీలోకి వెళ్లడంతో సీమ రాజకీయాలలో వైసీపీ పార్టీ మరొకసారి తన సత్తా చాటింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.