తెలుగు రాజకీయలే కాదు, ఇపుడు దేశ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. అయిదేళ్ళ పాటు తాము చేసిన అభివ్రుధ్ధిని గురించి చెప్పుకోవడం పాలకులు చేయడం మానేశారు. తమకు ఎలా వీలైతే ఆ దిశగా రాజకీయాలను, ఎన్నికల నినాదాలను అనుకూల మీడియా సాయంతో మార్చుకుంటూ గెలుపు కోసం చేయాల్సినదంతా చేస్తున్నారు.
కేసీయర్ వర్సెస్ బాబు :
ఏపీలో చంద్రబాబు సరికొత్త వ్యూహానికి పదును పెట్టారు. ఈసారి ఎన్నికల్లో కేసీయార్ని తెగ వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. కేసీయార్ వర్సెస్ బాబుగా రాజకీయాన్ని మార్చేయాలనుకుంటున్నారు. ఏపీలో కేసీయార్ కి ఏం పని అని అంటూ బాబు గద్దిస్తున్నారు. జగన్ ని ఇక్కడ సామంతరాజుగా పెట్టి తన పబ్బం గడుపుకోవాలని కేసీయార్ చూస్తున్నారంటూ పదునైన బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఏపీని కొల్లగొట్టి బాగుపడాలన్నదే కేసీయార్ లక్ష్యమని కూడా ఆరోపిస్తున్నారు.
అన్నీ వదులుకుని ఏపీకి వచ్చిన ప్రజలపై ఇంకా కక్ష సాధిస్తున్నారని చెబుతూ ఎమోషన్స్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విభజన గాయాలను, కేసీయార్ తిట్లను మరో మారు తట్టి లేపుతున్నారు. ఇంకా చెప్పాలంటే కేసీయార్ ని బాగా రెచ్చగొడుతున్నారు. ఆయన నాలుగు మాటలు అంటే దాన్ని జనంలోకి తీసుకుపోవాలనుకుంటున్నారు.
వర్కౌట్ అయ్యేనా :
ఏది ఎలా ఉన్న ఇప్పటికైతే బాబు రెచ్చగొట్టినా రెచ్చిపోయే స్థితిలో ఎపీ ప్రజలు లేరన్నది నిజం. అయితే కొన్ని అంశాల్లో తెలుగు వారిలో అనుమానాలు ఉన్నాయి. కేసీయార్ ఆశీస్సులతో ఇక్కడ జగన్ అధికారంలోకి వస్తే పోలవరం వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయేమోనని ఓ వర్గంలో అనుమానాలు ఉన్నాయి. వాటిపై కేసీయార్, ఇటు జగన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక కేసీయార్ తోవలోకి పోకుండా జగన్ తనకు తానుగా ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటే బాబు ప్లాన్స్ ఏవీ సాగవని అనే వారూ ఉన్నారు. ఏపీలో ఇపుడు ఏ అస్త్రం లేకపోవడం వల్లనే బాబు కేసీయార్ ని వాడుకోవాలనుకుంటున్నారని, దాన్ని జగన్ గ్రహించి తిప్పికొట్టకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.