ఇపుడిదే ప్రశ్న
తెలుగుదేశంపార్టీలో బాగా వినిపిస్తోంది. దాదాపు నెల రోజుల నుండి అభ్యర్ధుల ఎంపిక
విషయంలో చంద్రబాబునాయుడు బాగా బిజీగా గడిపేస్తున్నారు. జిల్లాల వారీగా లేకపోతే
లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వరకూ
ఒక్క అభ్యర్ధిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఫలానా నియోజకవర్గంలో అభ్యర్ధిని
ఫైనల్ చేశారని, ఫలాన నియోజకవర్గంలో నేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని లీకులైతే
బయటకు వదిలేస్తున్నారు.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కూడా లీకులిస్తుంటే ఇక అభ్యర్ధులను ఎప్పుడు ప్రకటిస్తారు ? మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ మహా అయితే ఓ 40 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి చేసుంటారు. ఈ 40 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 25 నియోజకవర్గాల్లో గొడవలే గొడవలు. ఏది చంద్రబాబు ఇచ్చిన లీకులతోనే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇక అధికారికంగా అభ్యర్ధులను ప్రకటిస్తే ఇంకేమన్నా ఉందా ?
విచిత్రమేమిటంటే, లీకుల్లో కూడా సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లిచ్చిన నియోజకవర్గాల్లోనే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. అనంతపురం అర్బన్, విశాఖపట్నం దక్షిణం, నిడదవోలు, పెద్దాపురం, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో గణబాబు లాంటి నియోజకవర్గాల్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. పాయకరావుపేటలో సిట్టింగ్ ఎంఎల్ఏ వంగలపూడి అనిత, కొవ్వూరులో మంత్రి జవహర్ లాంటి వాళ్ళకు ఎట్టి పరిస్దితుల్లోను టికెట్లు ఇవ్వకూడదని నేతలు ఏకంగా చంద్రబాబునే హెచ్చరిస్తున్నారు.
ఇక, కదిరి, పాడేరు, చోడవరం లాంటి ఫిరాయింపు నియోజకవర్గాల్లో టికెట్లిస్తే ఓడగొడతామంటూ బహిరంగ హెచ్చరికలే చేస్తున్నారు. మరి అన్ని ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఎంతమందికి టికెట్లిస్తారో క్లారిటీ లేదు. మొత్తం 22 మంది ఫిరాయింపుల్లో మంత్రులతో కలుపుకుని మహా అయితే ఓ ఏడుగురికి టికెట్లిస్తే ఎక్కువే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందరికీ ఇచ్చినా గెలిచేది కూడా డౌటే అనుకోండి.
అదే సమయంలో వైఎస్ జగన్ ఏమో కొందరు అభ్యర్ధులను బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు. ఇప్పటి వరకూ సుమారుగా 15 మంది ఎంఎల్ఏలను ప్రకటించారు. వారుకూడా విస్తృతంగా ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా అభ్యర్ధులను ఇంకా లీకుల రూపంలోనే ఎందుకు బయటకు వదులుతున్నారో పార్టీ నేతలకే అర్ధం కావటం లేదు. వివాదాలు లేని ఖాయంగా తిరిగి పోటీ చేస్తారని అనుకున్న నియోజవర్గాల్లో కూడా అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించకపోవటమే విచిత్రంగా ఉంది.