భారత దేశంలో పలు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వేల కోట్లు లూటీ చేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఉదంతం మరువక పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్ల రూపాయాల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ. అయితే ఆయన గురించి వివరాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియకుండా ఎంతో గోప్యంగా ఉంచుతూ వచ్చాడు. తాజాగా లండన్ వీధుల్లో నీరవ్ స్వేచ్ఛగా తిరుగుతుండగా.. టెలిగ్రాఫ్ పత్రిక నీరవ్ మోడీని పసిగట్టింది. 16 నెలల అనంతరం ఆయన మీడియాకు చిక్కాడు.
లండన్లోని వెస్ట్ఎండ్లో ఉండే సోహో ప్రాంతంలో నీరవ్ కొత్తగా డైమండ్ వ్యాపారం మొదలుపెట్టినట్లు ద టెలిగ్రాఫ్ పేర్కొన్నది. ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం దాటవేశాడు. ఈ సందర్భంగా టెలిగ్రాఫ్ పత్రికా విలేఖరి అడిగిన పలు ప్రశ్నలకు నో కామెంట్ అంటూ సమాధానం ఇచ్చాడు. ఖరీదైన నల్లటి లెదర్ జాకెట్ ధరించి దర్జాగా లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఇదిలా ఉంటే నీరవ్ మోడీకి సంబంధించిన రాయ్గడ్ జిల్లా అలీబాగ్లోని బంగ్లాను శుక్రవారం ఉదయం రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో కూల్చివేసిన సంగతి తెలిసిందే.
సాధారణంగా పెద్ద పెద్ద బుల్డోజర్లు వాడుతుంటారు..కూల్చి వేయడానికి..కానీ 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను పడగొట్టారు. ఈ బంగ్లాను 30వేల చదరపు అడుగుల స్థలంలో నీరవ్ మోడీ నిర్మించుకున్నారు. తీరప్రాంత రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాను నిర్మించుకోవడంతో ఈ అత్యంత విలాసవంతమైన బంగ్లాను అధికారులు కూల్చేశారు.2018 జులైలో నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నీరవ్ మోడీ భారత బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు.