ఏపీలో రాజకీయం బాగా వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము ఏం చేస్తామో చెప్పాల్సిన పార్టీలు ఇప్పుడు ఆ విషయాలను వదిలేసి.. ఫారమ్ 7 వివాదం, డాటా చోరీ వివాదం వంటి విషయాలపై ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు ఇంతకీ ఈ ఫారమ్ 7 ఏంటి.. దీని ద్వారా ఇంత గందరగోళం ఎందుకు తలెత్తింది.. ఓసారి పరిశీలిద్దాం..
అసలు ఫారమ్ 7 ఏంటి.. దీన్ని ఎందుకు వాడతారు.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిఉండటం ఎంత ముఖ్యమో.. దొంగ ఓట్లు లేకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అలా దొంగ ఓట్లను నిరోధించడానికి ఎన్నికల సంఘం కల్పించిన సౌకర్యమే ఫారమ్ 7. ఈ ఫారమ్ ద్వారా ఎవరి దొంగఓట్ల నైనా తొలగించవచ్చు.
మనకు ఫలానా వారి ఓటు దొంగ ఓటు అని అనుమానంగా ఉంటే.. సదరు ఓటరు ఇక్కడ లేకపోయినా ఓటు పొంది ఉంటే.. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగిఉంటే.. ఆ వివరాలు పొందుపరుస్తూ ఆన్ లైన్లో ఈ ఫారమ్ 7 దాఖలు చేయవచ్చు. అయితే ఫారమ్ 7 దాఖలు చేయగానే ఓటు తొలగిపోదు. దీన్ని ఎన్నికల సంఘం పూర్తిగా పరిశీలిస్తుంది. తనిఖీ నిర్వహించి ఆ ఆరోపణ నిజమని నిర్థారణ అయితేనే ఆ ఓటును తొలగిస్తుంది.