రాజకీయాలు అన్ని పార్టీలూ చేస్తాయి. కానీ దేశంలోనే నీతివంతమైన రాజకీయాలు చేసే ఏకైక పార్టీ మాదే అంటారు టీడీపీ నేత చంద్రబాబు. ఆయన నోరు ఎత్తితే చాలు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. నీతి, నిజాయితీ, నిప్పు వంటి పదాలే వస్తాయి. అలాంటి చంద్రబాబు తాజాగా గౌరు వెంకటరెడ్డి దంపతులకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలకడం చూస్తే ఆయన ఓటమి గురించి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేస్తుకోవచ్చు.
ఇది తెలుసుకోవాలంటే గౌరు వెంకటరెడ్డి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి. గౌరు వెంకటరెడ్డి ఓ ఫ్యాక్షనిస్టు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగు అనుచరుడు. ఆయనపై హత్యానేరాభియోగాలు ఉన్నాయి. ఓ కేసులో ఏకంగా యావజ్జీవం కూడా పడింది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో గౌరు వెంకటరెడ్డిని బయటకు తీసుకొచ్చేందుకు చట్టాలనే సవరించారు.
అప్పట్లో వైఎస్ చర్యను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనిపై పెద్ద యుద్ధమే చేశారు. యావజ్జీవశిక్ష పడినందువల్ల గౌరు వెంకటరెడ్డి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.. అందుకే ఆయన భార్య పోటీ చేస్తుంది.. గౌరు వెనుక ఉండి నడిపిస్తాడు.
ఇప్పుడు అదే గౌరు వెంకటరెడ్డికి చంద్రబాబు పార్టీలోకి స్వాగతం పలికారు. మరి ఇంతలోనే గౌరు వెంకటరెడ్డిలో ఏం మంచి లక్షణాలు కనిపించాయో తెలియదు. ఆయన నేరగాడు అనే విషయం కంటే .. ఆయన చేరికతో ఒక్క అసెంబ్లీ సీటు వచ్చినా రాజకీయంగా లాభమే కదా అన్నదే చంద్రబాబు ఆలోచన. దటీజ్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. నీతి నిప్పు రాజకీయాలు.