గుడివాడ.. ఏపీలోని హాట్ పొలిటికల్ సెంటర్లలో ఇది టాప్ ప్లేసుల్లో ఉంటుంది. ఇక్కడ కొన్నేళ్లుగా కొడాలి నాని ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. మొదట్లో టీడీపీ తరపున.. ఆ తర్వాత వైసీపీ తరపున కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారు. కొడాలి నాని ఇప్పుడు వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ స్థానంలో టీడీపీ టికెట్ ఎవరి ఇవ్వాలా అని పార్టీ అధినేత తలపట్టుకుంటున్నారు. కొడాలి నాని బలమైన క్యాడర్ ఉన్న నాయకుడు కావడంతో ఎవరిని పెట్టినా గెలుపు చాలా వరకూ కష్టమే.. దీనికి తోడు గుడివాడ తెలుగుదేశంలో వర్గపోరు భయంకరంగా ఉంది.గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటేశ్వరరావుకే మళ్లీ టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు కోరుతున్నా.. అధిష్టానం మాత్రం దేవినేని అవినాశ్ కు టికెట్ కేటాయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో గుడివాడ టీడీపీ టికెట్ దేవినేని అవినాష్కు ఇవ్వొద్దంటూ పార్టీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. గుడివాడ అసెంబ్లీ టికెట్ రావి వెంకటేశ్వరరావుకే ఇవ్వాలని నియోజకవర్గ టీడీపీ కార్యవర్గ సభ్యులు స్పష్టం చేశారు. శోభనా కాన్ఫ రెన్స్హాలులో శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించుకున్నారు.
నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉందామని, ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలసి పనిచేద్దామని కోరారు. కొంత మంది నాయకులు టికెట్ రావికి ఇవ్వని పక్షంలో పార్టీ పదవులకు రాజీనామా చేసి సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. మరికొంత మంది స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి టీడీపీ శ్రేణులు ఇలా టికెట్ విషయంలోనే తన్నుకుంటే ఇక కొడాలి నాని గెలుపు నల్లేరుపై నడకేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.