వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న సినీనటుడు అలీ.. చివరకు ఏ పార్టీ తరపున పోటీ చేయాలో తేల్చుకున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ.. మూడు పార్టీల నుంచి ఆహ్వానం ఉన్న అలీ.. చివరకు జగన్ వైపే మొగ్గారు. అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అయ్యింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో.. అలీ వైసీపీ కండువా కప్పు కోనున్నారు. అలీకి జగన్ స్వయంగా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాకినాడలో వైసీపీ ‘సమర శంఖారావం’ ఉండటంతో ఉదయమే అలీ వైసీపీలో చేరతారని తెలిసింది.
అలీ ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్తో వరుసగా భేటీ అయ్యారు. ఆయన టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గుంటూరులోనే పోటీ చేయాలన్నది అలీ ఆలోచనగా ఉంది.
చివరకు అలీ అందరికీ షాకిచ్చి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో చేరిక ఖాయమైనా.. అలీ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా తేలాల్సిఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? ఎంపీగా పోటీ చేస్తారా..? అనే విషయం కూడా క్లారిటీ రాలేదు. ఏదేమైనా అలీ టీడీపీని నిరాశపరిచినట్టే.