ఎన్నికల కమీషన్
ప్రకటించిన షెడ్యూల్ తో ఒకేసారి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరికి ఇబ్బందులు
తప్పేట్లు లేదు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్న చంద్రబాబుకు అసలు కసరత్తే
మొదలుపెట్టని పవన్ కు వెలువడిన తాజా షెడ్యూల్ షాకిచ్చినట్లే అనుకోవాలి. తమకెదురైన
ఇబ్బందుల్లో నుండి ఇద్దరూ ఎలా బయటపడతారన్నదే అందరిలోను ఆసక్తి రేపుతోంది.
కొద్ది రోజులుగా అభ్యర్ధుల ఫైనలేజేషన్ కు చంద్రబాబు చేస్తున్న కసరత్తు అందరికీ తెలిసిందే. లోక్ సభ నియోజకవర్గాల సమీక్షల పేరుతో ఇప్పటి వరకూ సుమారుగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేశారు. అంటే ఖరారైనట్లు లీకులు మాత్రమే ఇస్తున్నారనుకోండి అది వేరే సంగతి. అయితే, లీకులిస్తున్న అభ్యర్ధుల విషయంలో కూడా ఆయా నియోజకవర్గాల్లో మళ్ళీ సర్వేలు చేయిస్తున్నారట.
ఎన్నికల కమీషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు ఈనెల 18వ తేదీ నుండి మొదలవుతోంది. అంటే సరిగ్గా వారం మాత్రమే ఉంది. ఈ దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక వారంలో పూర్తి చేయాలంటే మాటలు కాదు. అభ్యర్ధుల ఎంపికపై అసలే చాలా జిల్లాల్లో గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబుకు బాగా ఇబ్బందే. చంద్రబాబుకే షెడ్యూల్ వల్ల ఇబ్బందంటే ఇక పవన్ సంగతి చెప్పాల్సిన పనేలేదు.
కాబట్టి పవన్ తక్షణం చేయగలిగిన పనేమిటంటే అర్జంటుగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటం. పొత్తు పెట్టేసుకుంటే జనసేన తరపున నిలబడే అభ్యర్ధులను కూడా చంద్రబాబే ఎంపిక చేయగలరు. కాబట్టి అభ్యర్ధుల ఎంపికలో పవన్ కు తలనొప్పులు తప్పిపోతాయి. ఇక నిధుల సమస్యంటారా ? అది కూడా చంద్రబాబే చూసుకుంటారు.
షెడ్యూల్ తో జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందులు తప్పవు. అయితే చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ సమస్యలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటికే జగన్ 25 మంది అభ్యర్ధులను బహిరంగంగా ప్రకటించేశారు. సిట్టింగులతో కలిపి మరో 100 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధుల ఎంపిక దాదాపు అయిపోయినట్లే. ఇక ఆశావహులెక్కువగా ఉన్న మిగిలిన నియొజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని క్లియర్ చేసుకుంటారు కాబట్టి జగన్ వరకూ ఇబ్బందులు తక్కువనే అనుకోవాలి. మొత్తానికి కమీషన్ ప్రకటించిన షెడ్యూల్ వల్ల చంద్రబాబు, పవన్ కు బాగా ఇబ్బందనే అనుకోవాలి.