ఎన్నికలు వచ్చాయంటే సెంటిమెంట్లకు కొదువ ఉండదు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి కూడా ఈ సెంటిమెంట్లు ఎక్కువే. అందుకే ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని తనకు ఇష్టమైన దేవాలయం నుంచి ప్రారంభించారు. ఎంపీ కేశినేని నాని కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం నెమలి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యే నల్లగండ్ల స్వామిదాసుతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎంపీ కేశినేని నానికి పూర్ణకుంభం తో స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. అనంతరం కేశినేని నాని అక్కడే ఎన్నికల శంఖారావం పూరించారు.
నెమలి గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్ధించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన వంటి అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలంటే తిరిగి తెలుగుదేశమే అధికారంలోకి రావాలన్నారు.
ఓట్ల తొలగింపుకు దొడ్డిదారిలో ప్రయత్నించిన వైకాపా అధినేత జగన్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను కూడా దోచుకుంటాడన్నారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి తెలుగుదేశానికి ఓటు వెయ్యాలని కోరారు. మరి ఈసారి కేశినేని నాని సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. ఆయన మళ్లీ విజయవాడ ఎంపీగా గెలుస్తారా..?