ఎట్టకేలకు వంగవీటి రాధా టీడీపీవైపే మొగ్గుతున్నట్టు కనపడుతోంది. అసలు ఆయన కొన్నాళ్ల క్రితమే టీడీపీలో చేరుతున్నారని అంతా అనుకున్నారు. ఆ మేరకు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కానీ సడన్ గా టీడీపీలో చేరికను వాయిదా వేసుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు.
మళ్లీ ఇప్పుడు ఆయన ఎన్నికలు దగ్గపడుతున్న సమయలో కీలక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. తాజాగా.. గత అర్ధరాత్రి వంగవీటి రాధ చంద్రబాబును కలిసారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో పాటు రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
కీలకనేత సుజనా చౌదరి వీరిద్దరినీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. లగడపాటి, రాధాకృష్ణ ఇరువురు నేతలు గత కొంతకాలంగా తెలుగుదేశం లో చేరుతారనే ప్రచారం ఉంది. రాధా తెలుగుదేశం లో చేరితే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచన ఉంది.
ఐతే.. ఈ నిర్ణయం ఫైనల్ కావడానికి కొన్ని సమీకరణాలు సాల్వ్ చేయాల్సి ఉంది. రాధకు ఎంపీ టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయణ పెడన అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. విచిత్రం ఏంటంటే.. అర్థరాత్రి రెండు గంటల వరకు లగడపాటి, రాధాల భేటీ జరిగింది.