2019 ఎన్నికలు ఇంకా సరిగ్గా నెల రోజులు కూడా లేకపోవటంతో అధికార, ప్రతి పక్ష పార్టీలు చాలా దూకుడుగా తమ ప్రచారానికి పదును పెట్టారు. అయితే ఫిరాయింపులు కూడా అసలు తగ్గటం లేదు. ఇప్పటికే టీడీపీ నుంచి వైస్సార్సీపీలోకి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారు. ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఖరారు అయ్యింది. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. తను ఎంపీగా మళ్లీ పోటీ చేయడానికి రెడీగా లేనట్టుగా.. తన భార్యకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని తోట నరసింహం ఇటీవల చంద్రబాబును కలిసి కోరినట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే పార్టీలోని ఈ నేతకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు జగ్గంపేట నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకే అవకాశం ఇవ్వడం ఖరారు అయ్యింది. ఈ నేపథ్యంలో తోట నరసింహం తనదారి తను చూసుకుంటున్నట్టుగా.. ఆయన వైసీపీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తోట నరసింహం భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమైందని, పెద్దాపురం నుంచి ఆమె వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం.
పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో వైసీపీ నుంచి ఈ స్పష్టత వస్తుండగా..టీడీపీలో ప్రతిష్టంభన నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పటివరకూ ఆయనకు టికెట్ ఖరారు కాలేదు. ఆయన స్థానంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్ ఖరారు అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై చిన్నరాజప్ప మాట్లాడుతూ.. తనకు ఇంకా స్పష్టతలేదు అని, ఈ అంశంలో చంద్రబాబు నాయుడు ఎలా చెబితే అని అంటున్నారు.