తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కోసం సోషల్ మీడియాలో వీడియోల రూపంలో ప్రత్యర్థి పార్టీల నాయకులకు కౌంటర్లు వేస్తూ పార్టీకి మద్దతు తెలుపుతూ పరోక్షంగా ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు తాజాగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జన సైనికులకు దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలో గుంటూరులో పవన్ కళ్యాణ్ అభిమానులతో సమావేశమైన నేపథ్యంలో నాగబాబు మాట్లాడుతూ...జనసేన కార్యకర్తలపై టిడిపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని నాగబాబు అన్నారు.
కేసులు పెడితే బెదిరేది లేదనీ, జన సైనికులపై చేయిపడితే ఊరుకునేది లేదన్నారు. తాను పార్టీలో సభ్యత్వం తీసుకోనప్పటికీ పవన్ గెలుపు కోసం జనసైనికులతో చివరి వరకు కలిసి పనిచేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెదేపాకు గట్టిగా బుద్ధి చెప్పాలని, జనసేనను గద్దెనెక్కించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కులాల మధ్య అధికారం కూరుకుపోయింది.
ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే పవన్ లాంటి వ్యక్తులు అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో తమ్ముడు ఒంటరివాడైనా.. అభిమానులు మెండుగా ఉన్నారుగ అని నాగబాబు అన్నారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి చివరి వరకు జనసైనికులు కష్టపడాలని పిలుపునిచ్చారు నాగబాబు.