1999, 2004 ఎన్నికల్లో జగ్గయ్యపేట నుండి వరుసగా గెలిచిన వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ....గత రెండు పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్నారు. ఇక ఇక్కడ నుండి టీడీపీ తరుపున నిలబడుతున్న శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) 2009, 14 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కూడా టీడీపీ ఇక్కడ నుండి శ్రీరామ్ తాతయ్యే నిలబడుతుండగా...వైసీపీ నుండి సామినేని అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు.
అయితే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను మళ్ళీ గెలిపిస్తుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో రూ.2,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయి వారికి కూడా అందించానని, అవే విజయనికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురామ్, టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్లు శ్రీరాంతాతయ్యకు అండగా ఉన్నారు. కానీ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకిత ఉంది.
అటు రెండు సార్లు ఓడిపోయిన సామినేని ఉదయభాను ఈసారైనా జగ్గయ్యపేటని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. సామినేనికి కూడా నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం, ప్రజాసమస్యలపై స్పందించడంలో ఉదయభాను ముందున్నారు. ఇక టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉదని, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని, అదే తన గెలుపునకు ప్రధాన అస్త్రమంటూ భాను చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇక్కడ జనసేన పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంది. అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ జనసేన ఇక్కడ గెలుపోటములని తారుమారు చేయొచ్చు. అందులోనూ వైసీపీ అభ్యర్ధి సామినేని ఉదయభాను కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇస్తే ఓట్లు చీలి టీడీపీకి కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తుంది.కాగా, ఈ నియోజకవర్గంలో జగ్గయ్యపేట టౌన్తోపాటు జగ్గయ్యపేట రూరల్, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలు ఉన్నాయి. వత్సవాయి జిల్లా సరిహద్దు మండలంగా ఉండటం... ఇప్పటికీ అక్కడ కమ్యూనిస్టుల హవా ఎక్కువగానే ఉంది.
అటు పెనుగంచిప్రోలు మండలం కమ్మ ఓటర్లు కీలకం కానున్నారు. మరి వీరి మద్ధతు ఎక్కువ ఏ పార్టీకి ఉంటుందో చూడాలి. అలాగే రూరల్, టౌన్ ప్రాంతంలో రెండు పార్టీలకు మద్ధతు ఇచ్చే ఓటర్లు సరిసమానంగా ఉన్నారు. ఇప్పటికే ఇరు జగ్గయ్యపేటలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి ఇక్కడ శ్రీరామ్ తాతయ్య హ్యాట్రిక్ కొడతారో లేక..సామినేని పాగా వేస్తారో..?