ప్రకాశం జిల్లాలోని
పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేయక తప్పేట్లు
లేదు. కొడుకు హితేష్ చెంచురామ్ ను పోటి చేయించే ఉద్దేశ్యంతో దగ్గుబాటి
వెంకటేశ్వరరావు వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, సాంకేతిక కారణాల వల్ల
హితేష్ పోటీకి దూరంగా ఉండాల్సొస్తోందని తెలిసిందే. హితేష్ అమెరికా పౌరుడు. రాబోయే
ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతోనే అమెరికా పౌరసత్వాన్ని వదులుకోవాలని
నిర్ణయించుకున్నారు.
సంవత్సరాలుగా అమెరికాలో ఉన్న హితేష్ అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో భారతదేశ పౌరసత్వం తీసుకోవాలని అనుకున్నారు. అమెరికా పౌరసత్వం రద్దు చేసుకుంటే కానీ భారతదేశ పౌరసత్వం సాధ్యంకాదు. అందుకనే అమెరికా పౌరసత్వం రద్దుకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ అమెరికా పౌరసత్వం రద్దు కాలేదని సమాచారం.
అమెరికా పౌరసత్వం రద్దు చేసుకోవటం, ఇక్కడ పౌరసత్వం తీసుకోవటం, ఓటు హక్కు సంపాదించుకుని నామినేషన్ వేసే సమయానికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకనే దగ్గుబాటినే పోటీ చేయమని జగన్ కోరుతున్నారట. ఎలాగూ హితేష్ పోటీ చేసినా దగ్గుబాటి మంత్రాగం వల్ల గెలవాల్సిందే. అదేదో స్వయంగా దగ్గుబాటే పోటీ చేస్తే సమస్యే ఉండదని కూడా జగన్ సూచించారట. మొత్తంమీద కొడుకును పోటీ చేయిద్దామని అనుకుంటే చివరకు దగ్గుబాటే పోటీ చేయాల్సొచ్చేట్లుంది.