సరిగ్గా వైసీపీ అధినేత జగన్ ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంంలో టైమ్స్ నౌ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ ఆ పార్టీ నేతల్లో గుబులురేపుతోంది. బీజేపీతో తమకు ఉన్న లింకు నిజమేనంటూ ఆ పార్టీ కి చెందిన నేత ఒకరు మాట్లాడుతూ మీడియాకు దొరికిపోవడం కలకలం సృష్టిస్తోంది. వైసీపీ నగర శాఖ అధికార ప్రతినిధి మనోజ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బీజేపీ పోటీ చేసే స్థానాల్లో వైసీపీ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మనోజ్ ఆ వీడియోలో చెప్పారు. టైమ్స్ నౌ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో మనోజ్ తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. బుధవారం ఈ స్టింగ్ ఆపరేషన్ వివరాలు
బయటకు వచ్చాయి.
ఆ వీడియోలో మనోజ్ ఏమన్నారంటే..
మేం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చాం. ఆ తర్వాత పలు నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించాం. మేం బీజేపీతోనే ఉన్నాం. 100శాతం మా మధ్య అవగాహన ఉంది. ఈ విషయంలో మా నేత విజయసాయిరెడ్డి తన పనిని సమర్థంగా చేస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన నాన్సెన్స్ ఏమీ మాట్లాడరు.
అవగాహన విషయంలో బుగ్గన కంటే విజయసాయిరెడ్డే ఎక్కువగా పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, జగన్కు మధ్య బంధం బలపడటానికి చాలా చేశారు. బీజేపీ కు కనీసం అభ్యర్థులు కూడా లేరు. అందుకే వారు పోటీచేసే కొన్ని స్థానాల్లోనైనా వైసీపీ తరఫున బలహీన అభ్యర్థులను నిలుపుతున్నాం.
కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారనుకోండి. ఆయన పోటీ చేసే స్థానంలో మా పార్టీ తరఫున బలహీన అభ్యర్థి పోటీలో ఉంటారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు. పార్టీ విధానం కూడా.. జగన్ నేరుగా ఈ విషయం మాతో చెప్పరు. పెద్దిరెడ్డి లాంటి ఐదారుగురు నేతలు జగన్తో మాట్లాడతారు. వారే మాకు సమాచారం అందజేస్తారు... అంటూ ఆ వీడియోలో మనోజ్ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.