ఎన్నికల వేడి మెల్లగా రాజుకుంటోంది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాయి. సెంటిమెంట్ ని రంగరిస్తూనే ఎక్కడ ఓట్ల పంట పండుతుందో చూసుకుని మరీ కీలక ప్రాంతాల్లో ప్రచారానికి రంగం సిధ్ధం చేసుకుంటున్నాయి.
విశాఖ జిల్లాలో ఒకే రోజు టీడీపీ, వైసీపీ అధినేతలు ఇద్దరు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారభించడం విశేషం. 17వ తేదీన చంద్రబాబు విశాఖ నగరంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. విశాఖ సిటీలో సీఎం భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంద్ర్హ కంచుకోటల నుంచే ప్రచారం చేయడం ద్వారా మెజారిటీ సీట్లను కొల్లగొట్టడానికి బాబ్లు పెద్ద ప్లాన్ వేశారు.ఇక మరో వైపు వైసీపీ అధినేత జగన్ కూడా విశాఖ జిల్లాకు అదే రోజున వస్తున్నారు.
జగన్ ఆ రోజున నర్శీపట్నంలో ప్రచారం చేపడతారని తెలుస్తోంది. వస్తూనే ఏకంగా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇలాకా అయిన ప్రాంతంలో మీటింగ్ పెట్టడం ద్వారా జగన్ బస్తీ మే సవాల్ అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలపైనే తాను ఫొకస్ పెడుతున్నట్లుగా జగన్ ఈ ప్రచారం ద్వారా స్పష్టం చేయనున్నారు. మొత్తం మీద ఉత్తరానికి మొక్కుతున్న ఈ ఇద్దరు నేతల పట్ల ఈ జిల్లాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే.