సినీనటులు రాజకీయాల్లో రావడం సహజమే.. ఈ అంశం దక్షిణాది రాజకీయాల్లో చాలా కామన్. ఇక్కడ సినీ నటులు ఏకంగా ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పుడు కర్ణాటకలోని ఓ స్థానంలో ఏకంగా ఓ హీరో.. మరో ఓల్డ్ హీరోయిన్ పోటీపడుతున్నారు. ఈ పోటీ ఆసక్తిదాయకంగా మారుతోంది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరనుకుంటున్నారా.. ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, జాగ్వర్ సినిమా హీరో నిఖిల్ గౌడ. ఇంకొకరు మన పాత తెలుగు సినిమా హీరోయిన్ సుమలత. ఈమె భర్త అంబరీశ్ కన్నడనాట పేరున్న నటుడు, రాజకీయ నాయకుడు. అంబరీశ్ ఇటీవలే కన్నుమూశారు.
ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సుమలత ముందుకొచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గంను పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ జేడీఎస్ తరపున నిఖిల్ గౌడ తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. అందుకే జేడీఎస్ చాలా సురక్షితమైన మాండ్యా నియోజకవర్గాన్ని ఎంచుకుంది.
ఎందుకంటే.. ఇక్కడ ఒక్కలిగ కులస్తులు చాలా ఎక్కువ. కుమార స్వామి సామాజిక వర్గం అదే. అందుకే నిఖిల్ గౌడ కోసమే ఈ స్థానాన్ని కాంగ్రెస్తో పొత్తుల్లో భాగంగా ఎంచుకుంది జేడీఎస్.
మరి సుమలత కూడా ఈ స్థానాన్నే ఎందుకు ఎంచుకుందంటారా.. ఆమె భర్త అంబరీశ్ గతంలో ఈ స్థానం నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. ఒక్కసారి కాదు.. ఏకంగా మూడు సార్లు మాండ్య నుంచి అంబరీష్ గెలిచారు. అందుకే ఇది సుమలతకు కూడా సురక్షిత ప్రాంతం. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో.