సీనియర్ రాజకీయవేత్త, సౌమ్యుడిగా పేరొందిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హఠన్మరణం పలువురిని కలచివేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. వివేకానందరెడ్డి మృతిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అనుమానాస్పద మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ స్పందించారు.
వివేకానందరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభలో, శాసనమండలిలో, లోక్సభలో ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలు అందించారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల ప్రజల్లో అనుమానాలు రావడంపై సీఎం చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీతో, ఇంటలిజెన్స్ అధికారులతో,కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి మృతిపై అత్యన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు.