వైస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు ఈ హత్య జరగటంతో కడప జిల్లా లో ప్రకంపనలు రేపుతోంది. ఇదిలావుంటే, వైఎస్ వివేకా మృతి పట్ల అనుమానాలు వ్యక్తంచేస్తూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన పీఏ కృష్ణారెడ్డి. ఉదయాన్నే ఇంటికి వెళ్ళి చూసేసరికి వైఎస్ వివేకా రక్తపు మడుగులో పడి వున్నారన్నది కృష్ణారెడ్డి చెబుతున్నమాట. మరోపక్క వైఎస్ వివేకాని ఎవరో హత్య చేశారంటూ కడపజిల్లా వ్యాప్తంగా గుగుసలు గుప్పుమున్నాయి.. అదీ ఉదయాన్నే ఈ ప్రచారం ప్రారంభం కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి చెందినవారే ఈ ప్రచారాన్ని తెరపైకి తేవడం అనుమానాలకు తావిస్తోందని వైసీపీ చెబుతోంది.
తొలుత గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మరణించారనే వార్త వెలుగు చూసినా, అది హత్య.. అన్న అనుమానాలు కొద్దిగంటల్లోనే బలపడ్డాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరోపక్క, ప్రభుత్వం 'సిట్' కూడా ఏర్పాటు చేసి, ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చుతామంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తమ రాజకీయ ప్రత్యర్థులపై అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికార పార్టీ ఒక్కసారిగా షాక్కి గురయ్యింది.
మంత్రి ఆదినారాయణరెడ్డి హడావిడిగా మీడియా ముందుకొచ్చారు.. వైఎస్ వివేకా మరణం పట్ల సంతాపం వ్యక్తంచేశారు. అక్కడితో ఆగలేదాయన. తనపై వైసీపీ అనవసరపు అనుమానాలు వ్యక్తం చేస్తోందనీ, కడప ఎంపీ సీటు విషయమై వివేకానందరెడ్డికీ, ఆయన సోదరుడి తనయుడు అవినాష్ రెడ్డి (మాజీ ఎంపీ)కీ మధ్య గొడవలు తలెత్తాయని వింత, చెత్త వాదనను తెరపైకి తెచ్చారు ఆదినారాయణరెడ్డి. కడపజిల్లాలో ఎన్నికల వేడి పీక్స్లోకి చేరిన ప్రస్తుత తరుణంలో వైఎస్ వివేకా మరణం.. రాజకీయంగా పెద్ద రచ్చకు కారణమవుతోంది.